వచ్చే ఏడాది బర్మింగ్హామ్లో నిర్వహించ తలపెట్టిన కామన్వెల్త్ క్రీడలు.. అనుకున్న సమయం ప్రకారం జరుగుతాయని కామన్వెల్త్ క్రీడా సమాఖ్య (సీజీఎఫ్) విశ్వాసం వ్యక్తం చేసింది. కరోనా కొత్త స్ట్రెయిన్ ఉద్ధృతి కారణంగా నిర్వహణపై ఏమీ చెప్పలేమని ఇటీవల అన్నారు ఆతిథ్య నగర కౌన్సిల్ నేత ఇయాన్ వార్డ్. దీంతో కార్యక్రమ నిర్వహణపై సందిగ్ధత నెలకొంది. ఈ నేపథ్యంలో షెడ్యూల్ ప్రకారమే జులై 28 నుంచి ఆగస్టు 8 వరకు పోటీలు జరుగుతాయని సీజీఎఫ్ సీఈఓ డేవిడ్ గ్రీవెంబర్గ్ స్పష్టతనిచ్చారు.
"ప్రణాళిక ప్రకారమే 2022 కామన్వెల్త్ క్రీడలు జరుగుతాయని సీజీఎఫ్ విశ్వసిస్తోంది. అది కొవిడ్ అనంతర ఐరోపాలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇంకా 18 నెలల సమయం ఉన్నందున మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా చర్యలు తీసుకుంటాం. అందుకోసం ప్రభుత్వంతో అన్ని స్థాయిల్లో, ఎన్జీవోలు, ఈవెంట్ నిర్వాహకులతో కలిసి పనిచేస్తున్నాం. భారీ స్థాయిలో కార్యక్రమం నిర్వహించాల్సి ఉన్నందున ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. వారు విధాన, వైద్య పరమైన సహకారం అందిస్తారు."
-డేవిడ్ గ్రీవెంబర్గ్, సీజీఎఫ్ సీఈఓ
వ్యాక్సినేషన్ సహ ఇతర నివారణ చర్యల ద్వారా పోటీల నిర్వహణ సాధ్యపడుతుందని గ్రీవెంబర్గ్ విశ్వాసం వ్యక్తం చేశారు. అథ్లెట్ల భద్రత, ఆరోగ్యకర వాతావరణ కల్పన తమ ప్రాధాన్యమని చెప్పారు.
ఐరోపాలో ఇటీవల కొవిడ్ స్ట్రెయిన్ విజృంభించగా, కొద్దిరోజులుగా పరిస్థితి మెరుగవుతుంది. ప్రస్తుతం అక్కడ టీకా పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. వైరస్ నేపథ్యంలోనే పోటీల నిర్వహణపై కచ్చితంగా చెప్పలేమని ఓ సమావేశంలో అన్నారు ఇయాన్ వార్డ్.
"భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పలేం. మరో కొత్త రకం వైరస్ ప్రబలవవచ్చు. ఒలింపిక్స్ నిర్వహణ కూడా సందిగ్ధంలో పడింది. అందుకే కామన్వెల్త్ క్రీడలు జరుగుతాయని కచ్చితంగా చెప్పలేం. కానీ బర్మింగ్హామ్ సహ ఐరోపా లబ్ధి దృష్ట్యా పోటీలు జరగాలని కోరుకుంటున్నా" అని వార్డ్ అన్నారు.
ఇదీ చూడండి: 'కామన్వెల్త్' గేమ్స్లోని ఆ పోటీలు భారత్లోనే