క్రికెటర్లు గాయాల బారిన పడటం మామూలే. అలాగే తిరిగి ఫిట్నెస్ సాధించడం, బరిలో దిగడం సాధారణమే. అయితే కీలక ఆటగాళ్లు, మెగా టోర్నీలకు ముందు గాయపడితే అతడి గురించి అటు టీమ్లో, ఇటు అభిమానుల్లో ఎక్కడలేని ఆందోళన మొదలవుతుంది. అప్పటివరకు అతడు కోలుకుంటాడా?, కోలుకున్నా ఫిట్నెస్ సాధిస్తాడా?, ఫిట్నెస్ సాధించినా గత ఫామ్ను తిరిగి అందుకుంటాడా? అన్నది అసలైన ప్రశ్న. ఈ ఏడాది అక్టోబర్లో టీ20 ప్రపంచకప్ జరగనుంది. ఇటీవల జరిగిన ఐపీఎల్లో గాయపడిన ఆటగాళ్లు ప్రస్తుతం కోలుకునే దశలో ఉన్నారు. మళ్లీ వారు ఎప్పుడు బరిలో దిగుతారు? ఫామ్ను తిరిగి అందుకుంటారా? అన్న అనుమానాలు అభిమానుల్లో నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో మెగాటోర్నీకి ముందు గాయపడిన కీలక ఆటగాళ్లు ఎవరో చూద్దాం.
శ్రేయస్ అయ్యర్ (దిల్లీ క్యాపిటల్స్)
దిల్లీ క్యాపిటల్స్ రెగ్యులర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఇంగ్లాండ్తో జరిగిన మొదటి వన్డేలో గాయపడ్డాడు. భుజంలోని ఎముక స్థానభ్రంశం చెందడం వల్ల ఇతడు ఈ సిరీస్కు దూరమవుతాడని మొదట ప్రకటించింది బీసీసీఐ. కానీ గాయం పెద్దది కావడం వల్ల చికిత్స అవసరమని భావించిన బోర్డు ఐపీఎల్ 2021లోనూ శ్రేయస్ పాల్గొనట్లేదని వెల్లడించింది. ఏప్రిల్లో తన భుజానికి చికిత్స చేసుకున్న శ్రేయస్ ప్రస్తుతం ఇంటివద్ద కోలుకుంటున్నాడు. కరోనా కారణంగా ఐపీఎల్ వాయిదా పడటం వల్ల సెప్టెంబర్లో పునఃప్రారంభమయ్యే లీగ్లో బరిలో దిగాలని భావిస్తున్నాడు. ఈ టోర్నీకి ముందే ఇతడు శ్రీలంకలో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్కు ఎంపికవుతాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
బెన్ స్టోక్స్ (రాజస్థాన్ రాయల్స్)
రాజస్థాన్ రాయల్స్కు బెన్ స్టోక్స్ ప్రధాన ఆల్రౌండర్. ఇతడిపైనే జట్టు ఎన్నో ఆశలు పెట్టుకుంది. కానీ సీజన్లో పంజాబ్ కింగ్స్తో జరిగిన మొదటి మ్యాచ్లోనే జట్టుకు పెద్ద దెబ్బ తగిలింది. ఈ మ్యాచ్లో క్రిస్ గేల్ ఇచ్చిన క్యాచ్ను అందుకునే సమయంలో స్టోక్స్ ఎడమచేతి వేలు విరిగింది. దీంతో ఇతడు లీగ్ మొత్తానికి దూరమయ్యాడని ప్రకటించింది ఫ్రాంచైజీ. తర్వాత ఇంగ్లాండ్ పయనమైన స్టోక్స్ చికిత్స తీసుకుని కోలుకుంటున్నాడు. త్వరలోనే మళ్లీ జట్టులోకి వస్తాడని అనుకుంటున్నారు. కానీ ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు వారి ఆటగాళ్లు మిగతా ఐపీఎల్లో పాల్గొనే అవకాశం లేదని తెలిపింది. టీ20 ప్రపంచకప్ను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
నటరాజన్ (సన్రైజర్స్ హైదరాబాద్)
ఆస్ట్రేలియా పర్యటనలో అనూహ్యంగా టీమ్ఇండియాకు ఎంపికై సత్తాచాటిన పేసర్ నటరాజన్ ఎన్నో ఆశలతో ఐపీఎల్ 2021లో అడుగుపెట్టాడు. మొదటి రెండు మ్యాచ్లు ఆడిన ఇతడు ఆ తర్వాత గాయం కారణంగా పూర్తి లీగ్కు దూరమవుతున్నట్లు ఫ్రాంచైజీ తెలిపింది. ఇటీవలే విజయవంతంగా మోకాలి చికిత్స పూర్తి చేసుకున్న నటరాజన్ సెప్టెంబర్లో తిరిగి ప్రారంభమయ్యే లీగ్లో సత్తాచాటాలని భావిస్తున్నాడు. ఈ టోర్నీలో కనుక మంచి ప్రదర్శన కనబరిస్తే టీ20 ప్రపంచకప్కు ఎంపికయ్యే అవకాశం ఉంటుంది.
జోఫ్రా ఆర్చర్
ఈ ఐపీఎల్ సీజన్లో రాజస్థాన్ రాయల్స్కు జోఫ్రా ఆర్చర్ గాయం మరో దెబ్బే. టీమ్ఇండియాతో జరిగిన సిరీస్ సందర్భంగా గాయపడిన ఆర్చర్ లీగ్కు పూర్తిగా దూరమయ్యాడు. బాత్రూమ్లో తన వేలికి గాజుముక్క గుచ్చుకోవడం వల్ల చికిత్స అవసరమైంది. అనంతరం విజయవంతంగా చికిత్స పూర్తి చేసుకున్న ఇతడు ఇటీవలే కౌంటీ క్రికెట్లో అడుగుపెట్టాడు.