భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) 39వ అధ్యక్షుడిగా టీమిండియా మాజీ సారథి సౌరవ్ గంగూలీ పూర్థి స్థాయిలో బాధ్యతలు చేపట్టాడు. ఫలితంగా సుప్రీంకోర్టు నియమించిన క్రికెట్ పాలక కమిటీ(సీఓఏ) ఆ పదవికి గుడ్బై చెప్పేసింది. అయితే ఇన్నాళ్లు భారత క్రికెట్ వ్యవహారాలు చూసిన సీఓఏ చీఫ్ వినోద్ రాయ్, సభ్యురాలు డయానా ఎడుల్జీకి... 33 నెలల కాలానికి ఒక్కొక్కరికి రూ. 3.5 కోట్లు చెల్లించాలిని బీసీసీఐ నిర్ణయించింది. వీరితో పాటు కొన్ని నెలలు సీఓఏలో సభ్యులుగా ఉన్న విక్రమ్ లిమాయేకు రూ. 50.5 లక్షలు, రామచంద్ర గుహకు రూ. 40 లక్షల చొప్పున ఇవ్వాలని భావించింది.
బీసీసీఐ నిర్ణయంపై రామచంద్ర గుహ భిన్నంగా స్పందించాడు. తనకు బోర్డు నుంచి ఒక్క రూపాయి కూడా అవసరం లేదని స్పష్టం చేశాడు.
"సీఓఏ సభ్యుడిగా పనిచేయడం గౌరవంగా భావిస్తున్నాను. ఆ పదవిని డబ్బు కోసం చేపట్టలేదు. ఇది నా వ్యక్తిగత నిర్ణయం. 33 నెలలు పనిచేసిన వినోద్ రాయ్, ఎడుల్జీ కూడా బీసీసీఐ ఇచ్చే భారీ వేతనాన్ని అంగీకరించడం సరైనది కాదని అనుకుంటున్నా. నేను కమిటీ సభ్యుడిగా పనిచేసింది కొన్ని నెలలైనా... క్రికెట్ అభివృద్దికి నా వంతు కృషి చేశాను. నేను బాధ్యతలు చేపట్టేసరికి క్రికెట్ పరిపాలన గందరగోళంగా ఉంది. ఆ పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నం చేశాను."
-రామచంద్ర గుహ, సీఓఏ సభ్యుడు .
బోర్డులో రోజువారి కార్యకలాపాల్లో అవినీతి, అక్రమాలు జరిగాయన్న ఆరోపణలతో సుప్రీంకోర్టు... 2017లో అప్పటి అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ను పదవి నుంచి తప్పించింది. జస్టిస్ లోథా సంస్కరణలు అమలు చేసేందుకు 2017 జనవరిలో వినోద్ రాయ్, విక్రమ్ లిమాయే, డయానా ఎడుల్జీ, రామచంద్రగుహలతో కూడిన క్రికెట్ పరిపాలకుల కమిటీ(సీఓఏ)ని నియమించింది. అయితే పలు వ్యక్తిగత కారణాలతో 2017 జులైలో రామచంద్రగుహ, అనంతరం విక్రమ్ లిమాయే సీఓఏ నుంచి తప్పుకున్నారు. అయితే వీర్దిదరూ పక్కకు జరిగినప్పటికీ వినోద్ రాయ్, ఎడుల్జీలు భారత క్రికెట్ వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహించారు.
ఇదీ చూడండి : 'రిజర్వ్ డే' విషయంలో బీసీసీఐపై యువీ, భజ్జీ ఫైర్