కరోనా ప్రభావంతో ఇండియన్ ప్రీమియల్ లీగ్(ఐపీఎల్) వాయిదా పడింది. ఈనెల 29న ప్రారంభం కావాల్సిన ఈ టోర్నీ... వచ్చే నెల 15 నుంచి మొదలు కానుంది. విదేశీ క్రికెటర్ల ఇక్కడికి వచ్చే విషయం మాత్రం సందిగ్ధంలోనే ఉంది. పలు దేశాల బోర్డులు తమ ఆటగాళ్లను పంపించాలా? వద్దా? అని పునరాలోచనలో పడ్డాయి. న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు మాత్రం ఈ నిర్ణయాన్ని క్రికెటర్లకే వదిలేసింది.
"మన పరిస్థితి ఇంకా ఏం మారలేదు. ప్రభుత్వం, అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ చెప్పిన విషయాలకు అనుగుణంగా నడుచుకుంటాం. ఇక ఐపీఎల్లో ఆడాలా? వద్దా? అనే విషయాన్ని ఆటగాళ్లే నిర్ణయించుకుంటారు."
-న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు
కరోనా ప్రభావం వల్ల ఐపీఎల్ మ్యాచ్లను నిర్వహించేందుకు ఇప్పటికే పలు రాష్ట్రాల క్రికెట్ సంఘాలు విముఖత వ్యక్తం చేశాయి. మరికొన్ని ఆలోచనలో పడ్డాయి. కర్ణాటక, దిల్లీలో మ్యాచ్లను నిర్వహించే వీలులేదని అక్కడి ప్రభుత్వాలు స్పష్టం చేశాయి. మహారాష్ట్ర అదే దారిలో ఉంది. అందువల్ల ఐపీఎల్ను వాయిదా వేయాలని నిర్ణయం తీసుకుంది ఐపీఎల్ పాలక మండలి.