కరోనా విజృంభిస్తున్నా.. ఒలింపిక్స్లో దేశానికి పతకం అందించాలన్న ఏకైక లక్ష్యంతో సాధన చేస్తున్నట్లు ప్రపంచ ఛాంపియన్ పీవీ సింధు తెలిపింది. మలేసియా ఓపెన్ వాయిదా పడటం ఒలింపిక్ సన్నాహాలకు ఎదురుదెబ్బ అన్న ఆమె.. మెగా ఈవెంట్ కోసం సన్నాహాలు, క్రీడల నిర్వహణపై నెలకొన్న అయోమయంపై ఈనాడుతో మాట్లాడింది.
ఒలింపిక్స్ సన్నాహాలెలా సాగుతున్నాయి?
కోచ్ పార్క్ ఆధ్వర్యంలో గచ్చిబౌలి స్టేడియంలో శిక్షణ బాగా సాగుతోంది. సాధన సందర్భంగా కోచ్ మ్యాచ్ పరిస్థితులను సృష్టించే ప్రయత్నం చేస్తోంది. ఆమె నా ఆటను బాగా విశ్లేషిస్తోంది. ఇంగ్లాండ్లో శిక్షణ తర్వాత కొన్ని టోర్నీల్లో ఆడాను. వాటిలో లోపాల్ని సరిదిద్దుకుంటూ తర్ఫీదు పొందుతున్నా. కరోనా తీవ్రత దృష్ట్యా పూర్తి జాగ్రత్తల నడుమ సాధన సాగిస్తున్నా. సుచిత్ర అకాడమీ నుంచి కలిసి ఆడేందుకు భాగస్వాములు వస్తున్నారు. కోచ్ రూపొందించిన ప్రణాళిక ప్రకారం భాగస్వాముల్ని రప్పిస్తున్నాం. పక్క కోర్టులో ఎవరూ ఉండకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఎవరినీ గుంపులుగా ఉండనివ్వట్లేదు. సామాజిక దూరం పాటిస్తున్నాం.
మలేసియా ఓపెన్ వాయిదా పడటం ఒలింపిక్ సన్నాహాలపై ప్రభావం చూపిందా?
ఆ టోర్నీ వాయిదా పడుతుందని ఊహించలేదు. ఆ టోర్నీలో భారత క్రీడాకారుల్ని ఆడించడం కోసం కేంద్ర ప్రభుత్వం, బాయ్ అన్ని ప్రయత్నాలు చేశాయి. చివరికి టోర్నీ వాయిదా పడింది. టోక్యో ఒలింపిక్స్కు ముందు రెండు అర్హత టోర్నీల్లో ఇదొకటి. ఇప్పటికే ఒలింపిక్స్ బెర్తు దకించుకున్న నాకు.. మెగా క్రీడలకు అర్హత సాధించాలనుకున్న చాలామంది క్రీడాకారులకు మలేసియా, సింగపూర్ ఓపెన్లు అత్యంత కీలకమైనవి. ఈ సమయంలో ఒక టోర్నీ వాయిదా పడటం.. మరో టోర్నీలో ఆడే అవకాశం లభిస్తుందా? లేదా? అన్న సందిగ్ధం నెలకొనడం ఆందోళన కలిగిస్తోంది. ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు.
కరోనా తీవ్రత మీపై మానసికంగా ప్రభావం చూపుతోందా?
బయటి పరిస్థితులు చూస్తుంటే ఎంతో బాధగా ఉంది. చాలామంది చనిపోతున్నారు. ఈ ప్రపంచానికి ఏమైందో అర్థం కావట్లేదు. కరోనా మహమ్మారి పంజా విసిరి ఏడాది దాటుతున్నా ఇంకా ఈ ఉపద్రవం నుంచి బయటపడలేకపోతున్నాం. మన చేయగలిగిందల్లా జాగ్రత్తగా ఉండటమే. అందరినీ జాగ్రత్తలు పాటించేలా చేయాలి. నా వరకు ఇల్లు, స్టేడియమే. బయట ఎక్కడికీ వెళ్లట్లేదు. టోర్నీలకు వెళ్లాలన్నా భయంగానే ఉంది. విమానంలో కొవిడ్ సోకుతుందేమో చెప్పలేం. విదేశాల్లో కరోనా సోకితే పరిస్థితి మరింత గందరగోళంగా తయారవుతుంది.
ఒలింపిక్స్ సజావుగా జరుగుతాయనుకుంటున్నారా?
కరోనా విలయ తాండవంలోనూ స్టేడియాలకు వెళ్లి సాధన చేయడానికి కారణం ఒలింపిక్స్. ప్రతిష్టాత్మక క్రీడల్లో దేశానికి పతకం అందిచాలన్నదే ఏకైక లక్ష్యం. ప్రమాదకర పరిస్థితులు ఉన్నప్పటికీ ఫిట్నెస్ కాపాడుకుంటూ.. శిక్షణ తీసుకుంటున్నాం. అత్యుత్తమ స్థితిలో ఉండేందుకు ప్రయత్నిస్తున్నాం. అయితే అసలు ఒలింపిక్స్ నిర్వహిస్తారా? లేదా? అన్నదాంట్లో స్పష్టత లేదు. రిస్క్ అని తెలిసినా ఒలింపిక్స్కు ముందు మ్యాచ్ ప్రాక్టీస్ కోసం మలేసియా, సింగపూర్ ఓపెన్లలో ఆడేందుకు సిద్ధమయ్యాం. ఒలింపిక్స్ నిర్వహించలేమని ముందుగా చెబితే అర్థం చేసుకుంటాం. కాని ఏమీ తెలియట్లేదు. టోక్యోలో కేసులు పెరుగుతున్నాయి. అక్కడ కూడా పరిస్థితి తీవ్రంగానే ఉంది. ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఒలింపిక్స్ జరుగుతాయా? లేదా? అన్నది తెలియట్లేదు.
ప్రమాదకర పరిస్థితుల్లో ఎలా సాధన చేస్తున్నారు?
గతేడాది కూడా దారుణమైన పరిస్థితిని ఎదుర్కొన్నాం. కరోనా ఎందుకు వస్తుందో? ఎలా వస్తుందో? ఎవరికి వస్తుందో? తెలియక భయాందోళనలకు గురయ్యాం. ఇప్పుడు కరోనాపై కొంత అవగాహన వచ్చింది. దేశంలో కేసులు పెరుగుతున్నాయి. కానీ వైరస్ సోకకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చాలామందిలో అవగాహన వచ్చింది. ఏమీ ముట్టుకోకుండా.. ఎవరినీ తాకకుండా.. భౌతిక దూరం పాటిస్తూ.. మాస్కులు పెట్టుకుంటూ.. పదే పదే చేతులు శుభ్రం చేసుకుంటూ జాగ్రత్తలు పాటిస్తున్నాం.