కరోనా వైరస్ తెచ్చిన విశ్రాంతి ఆటపై, ఫిట్నెస్పై తీవ్ర ప్రభావం చూపెడుతోందని అంటున్నాడు భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్ ఆటగాడు, ప్రపంచ ఛాంపియన్షిప్ కాంస్య పతక విజేత భమిడిపాటి సాయిప్రణీత్. ఇక సాధన ఆరంభించకుంటే కష్టమని అన్నాడు. దేశంలో చాలా చోట్ల షట్లర్లు ప్రాక్టీస్ మొదలుపెట్టారని హైదరాబాద్లోనూ ఆ అవకాశం కల్పించాలంటున్న సాయిప్రణీత్తో ఫోన్ ఇంటర్వ్యూ వివరాలివి.
వాళ్లు అలా.. మేము ఇలా..
మూడు నెలలుగా ఇంట్లోనే ఉంటుండటం చాలా కష్టంగా ఉంది. ఫిట్నెస్ పూర్తిగా గాడితప్పింది. చిన్న డంబెల్స్ తెచ్చుకుని కసరత్తులు చేస్తున్నా. అపార్ట్మెంట్లోనే అటుఇటు పరుగెత్తడం మినహా ఏమీ చేయట్లేదు. మ్యాచ్ ఫిట్నెస్ రావడానికి కనీసం రెండు నెలలు సమయం పడుతుంది. మ్యాచ్ ఆడేంత సామర్థ్యం రావాలంటే చాలా కష్టపడాలి. హైదరాబాద్లో సాధనకు ఎప్పుడు అనుమతి లభిస్తుందా అని ఎదురు చూస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం అనుమతివ్వడం వల్ల దేశవ్యాప్తంగా క్రీడా సముదాయాలు, స్టేడియాల్లో కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. బెంగళూరుతో సహా మిగతా ప్రాంతాల్లో తోటి క్రీడాకారులు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మేం ఇంట్లో ఉండటం ఇబ్బందిగా ఉంది.
బ్యాడ్మింటన్లో భౌతిక దూరం
దేశంలో బ్యాడ్మింటన్కు హైదరాబాద్ కేంద్రం. అగ్రశ్రేణి క్రీడాకారులంతా ఇక్కడే ఉన్నారు. జాతీయ శిక్షణ శిబిరం, సాయ్ కేంద్రం హైదరాబాద్లో పనిచేస్తున్నాయి. దేశవ్యాప్తంగా లాక్డౌన్ నుంచి క్రీడలకు మినహాయింపు ఇచ్చిన నేపథ్యంలో హైదరాబాద్లోనూ అనుమతిస్తే బాగుంటుంది. కనీసం ఒలింపిక్ ప్రాబబుల్స్ క్రీడాకారులకు ప్రాక్టీస్ చేసుకునే వెసులుబాటు కల్పించాలి. నాతో పాటు ఒలింపిక్స్ రేసులో ఉన్న సింధు, సైనా నెహ్వాల్, శ్రీకాంత్, కశ్యప్, డబుల్స్ క్రీడాకారులకు ప్రాక్టీస్ చాలా ముఖ్యం. గోపీచంద్ అకాడమీలో 9 కోర్టులు ఉంటే.. నలుగురు ఓ మూల.. నలుగురు మరో మూల సాధన చేసుకుంటాం. సినిమా షూటింగ్స్, మాల్స్ కంటే బ్యాడ్మింటన్లోనే భౌతిక దూరం పాటించడానికి ఎక్కువ అవకాశముంది. ఒక్కసారే క్రీడాకారులందరికీ అనుమతి ఇవ్వమని కోరట్లేదు. 10 మంది ఒలింపిక్ ప్రాబబుల్స్కు కరోనా పరీక్షలు నిర్వహించిన తర్వాతే అనుమతివ్వమని విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నాం.
మేమూ బరిలో దిగాలి
బెంగళూరుతో సహా అన్ని కేంద్రాల్లో బ్యాడ్మింటన్ క్రీడాకారులు ప్రాక్టీస్ చేస్తున్నారు. భౌతిక దూరం పాటిస్తూ.. శానిటైజ్ చేసుకుంటూ అకాడమీల్లో ఆడుతున్నారు. ఇప్పటి వరకు ఇబ్బందులేమీ తలెత్తలేదు. కరోనాకు అందరూ భయపడుతున్నారు. కానీ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సెప్టెంబరు లేదా అక్టోబరులో టోర్నీలు ప్రారంభం కావ్వొచ్చు. ప్రపంచంలోని క్రీడాకారులంతా ఆడితే మేమూ బరిలో దిగాల్సిందే. ఇప్పుడు ప్రాక్టీస్ ఆరంభిస్తే 3 నెలలు కఠోర పరిశ్రమ అవసరం. వీలైనంత త్వరగా కోర్టులో అడుగుపెట్టకపోతే వెనకబడిపోతాం.