యావత్ ప్రపంచాన్ని వణికిస్తోన్న కొవిడ్-19 కాటుకు సినీ రంగం విలవిలలాడుతోంది. అప్పుచేసి సినిమాలు తీసి, రూపాయి రూపాయి వసూలు చేసుకునే నిర్మాతలకు కరోనా కోలుకోలేని నష్టాన్ని తెచ్చిపెడుతోంది. లాక్డౌన్తో ఇప్పటికే థియేటర్లు మూతపడగా.. సినిమాల విడుదల వాయిదా పడింది. దీంతో బయ్యర్లు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు లబోదిబోమంటున్నారు. ఇదే కాకుండా అగ్ర హీరోల సినిమా షూటింగ్స్ నిలిచిపోయాయి. ఫలితంగా కనీవినీ ఎరుగని రీతిలో టాలీవుడ్కు ఈ ఏడాది కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది.
మహేశ్ బాబు 'సరిలేరు నీకెవ్వరు', అల్లు అర్జున్ 'అల వైకుంఠపురములో' చిత్రాలతో ఈ ఏడాది ప్రారంభంలోనే సుమారు రూ.250 కోట్ల వసూళ్లు దక్కించుకుంది టాలీవుడ్. అదే దూకుడుతో వేసవిలోనూ బాక్సాఫీసు కనకవర్షం కురిపించడం ఖాయమని నిర్మాతలు భావించారు. పెద్ద హీరోలతో పలు సినిమాలను ప్లాన్ చేసుకున్నారు. సుమారు రూ.1000 కోట్ల వ్యాపారం జరుగుతుందని అంచనాలు వేసుకున్నారు. ఆ దిశగానే చిత్రీకరణలు, రిలీజ్లు ప్లాన్ చేసుకున్నారు. కానీ వారి ఆశలను తలకిందులు చేస్తూ కరోనా వెండితెరను కమ్మేసింది. థియేటర్లను మూసేసింది. ఈ కారణంతో మార్చిలో రావాల్సిన పలు చిత్రాలు కరోనా దెబ్బకు వాయిదా పడ్డాయి.

యాంకర్ ప్రదీప్ హీరోగా నటించిన '30 రోజుల్లో ప్రేమించడం ఎలా?' సినిమాకు బిజినెస్ భారీగా జరిగింది. మార్చి 25న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లు ప్రకటించారు. కానీ విడుదలకు వారం ఉందనగా, కరోనా ప్రభావంతో లాక్డౌన్ విధించారు. దీంతో రిలీజ్ ఆగిపోయింది. ఫలితంగా రూ.20 నుంచి రూ.30 కోట్లు ఖర్చుచేసి తీసిన ఈ చిత్రం.. నిర్మాతకు భారంగా మారింది.

రాజ్ తరుణ్ 'ఒరేయ్ బుజ్జిగా' మార్చిలోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. అందుకు తగ్గట్లుగానే ప్రచారమూ చేశారు. పలు జిల్లాల్లో ప్రిరిలీజ్ ఈవెంట్లు నిర్వహించారు. తక్కువ బడ్జెట్తో తీసినా, మంచి వసూళ్లు సాధిస్తుందని నిర్మాత కె.కె.రాధామోహన్ భావించారు. చివరకు కరోనా వల్ల విడుదల నిలిచిపోయింది. ఇప్పుడు దర్శక నిర్మాతలకు ఏం చేయాలో పాలుపోవడం లేదు.

నేచురల్ స్టార్ నాని 'వి' సినిమాను ఉగాదికి తేవాలని ప్రణాళిక వేసుకున్నారు. సుమారు రూ.25 నుంచి 30 కోట్లతో దిల్రాజు నిర్మించారు. ఉగాదికి విడుదల చేస్తే సుమారు రూ.50 కోట్లు వసూళ్లు సాధిస్తుందనుకున్నారు. కానీ కరోనా ఈ సినిమాపైనూ కాటేసింది. లాక్డౌన్ పెరిగే అవకాశం ఎక్కువగా ఉండటం వల్ల ఈ చిత్ర వ్యాపారానికి భారీగానే గండిపడింది.

'బాహుబలి' తర్వాత ఎంతో కష్టపడి దాదాపు 150 రోజులు అడవుల్లో తిరుగుతూ దగ్గుబాటి రానా చేసిన చిత్రం 'అరణ్య'. ఎరోస్ ఇంటర్నేషనల్ పతాకంపై సుమారు 100 కోట్ల బడ్జెట్ తో మూడు భాషల్లో రూపొందించారు. ఏప్రిల్ 2న విడుదల తేదీని ఖరారు చేశారు. త్రిభాషా చిత్రం కావడం వల్ల రూ.200 కోట్ల వ్యాపారం జరుగుతుందని దర్శక నిర్మాతలు అంచనా వేసుకున్నారు. వారి అంచనాలు తలకిందులు కావడం వల్ల కొనేందుకు వచ్చిన బయ్యర్లు వెనక్కి తగ్గారు. థియేటర్ల మూసివేత, లాక్డౌన్ అమల్లో ఉండటం వల్ల ఎరోస్ సంస్థకు ఆర్థికంగా భారీ నష్టమే కలుగుతోంది.

సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమవుతోన్న సినిమా 'ఉప్పెన'. కొత్త దర్శకుడు బుచ్చిబాబుతో మైత్రీమూవీ మేకర్స్ సుమారు రూ.40 కోట్లు ఖర్చుపెట్టి ఈ చిత్రాన్ని నిర్మించింది. వేసవిలో మంచి బిజినెస్ అవుతుందని భావించి ఏప్రిల్ 2న విడుదలకు ప్రణాళిక వేసుకుంది. ఈలోగా ఉప్పెనలా వచ్చిన కరోనా.. మైత్రీ ఆశలను ఎగరేసుకుపోయింది. బడ్జెట్కు మించి వ్యాపారాన్ని ఊహించిన నిర్మాతలకు కొత్త కష్టాలు తెచ్చిపెట్టింది.
ఇలా మార్చి, ఏప్రిల్లోని సినిమాల విడుదల వాయిదా పడగా, భారీ బడ్జెట్ చిత్రాల షూటింగ్స్ అర్ధాంతరంగా నిలిచిపోయాయి. ఈ వేసవి సెలవులతోపాటు దసరా, దీపావళి, వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేసుకున్న దర్శక నిర్మాతల లెక్కలు తారుమారయ్యాయి.
మెగాస్టార్ చిరంజీవి-కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న సినిమా 'ఆచార్య'. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా సుమారు రూ.200 కోట్ల బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. అన్నీ కుదిరితే ఈ ఏడాదిలోనే సినిమాను విడుదల చేయాలని భావించారు. కానీ కరోనా వల్ల కార్మికుల శ్రేయస్సు దృష్ట్యా చిరు, తొలుత ఈ సినిమా షూటింగ్ నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. అర్ధాంతరంగా చిత్రీకరణ ఆగిన ఆచార్య.. ఇప్పట్లో సెట్స్పైకి వెళ్లేలా కనిపించడం లేదు.

దర్శకధీరుడు రాజమౌళి.. 'బాహుబలి' తర్వాత అదే స్థాయిలో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తోన్న చిత్రం 'ఆర్ఆర్ఆర్'. సుమారు రూ.350 కోట్ల భారీ బడ్జెట్తో 10 భాషల్లో తెరకెక్కిస్తున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై దానయ్య నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 8న విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే 75 శాతం షూటింగ్ పూర్తి చేసినట్లు చెప్పారు. కరోనా కల్లోలంలోనూ చరణ్ పుట్టినరోజు కానుకగా ప్రత్యేక టీజర్ విడుదల చేసి కథ ఎలా ఉండబోతుందో బయ్యర్లకు రుచి చూపించారు. అయితే మిగతా షూటింగ్ పూర్తి చేయాలని భావిస్తున్న రాజమౌళికి పరిస్థితులు ప్రతికూలంగా మారాయి. దీంతో మిగిలిన షూటింగ్ మేలో మొదలుపెట్టకపోతే వచ్చే సంక్రాంతికి ఈ సినిమా రావడం కష్టంగానే కనిపిస్తోంది.

రెబల్ స్టార్ ప్రభాస్ 20వ సినిమాపైనా కరోనా ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ చిత్రానికి రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. యూవీ క్రియేషన్స్తో కలిసి సీనియర్ నటుడు కృష్ణంరాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సుమారు రూ.300 కోట్ల బడ్జెట్ కేటాయించారు. ఇటీవలే జార్జియాలో షెడ్యూల్ ముగించుకుని వచ్చిన వీరికి కరోనా బ్రేక్ వేసింది. మే వరకు విదేశాల్లో షెడ్యూల్ ప్లాన్ చేసుకున్న చిత్రబృందం.. కరోనా వల్ల హైదరాబాద్ వచ్చేసింది. ప్రస్తుతం ఎక్కడిక్కడ చిత్రీకరణ నిలిపివేసిన దర్శక నిర్మాతలు సైలెంట్గా ఉండిపోయారు. ఈ అంతరాయం సినిమా విడుదలతోపాటు బడ్జెట్ పరంగానూ పెను ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితులను బట్టి, వచ్చే ఏడాది వేసవిలోనూ ఈ సినిమా రావడం కష్టంగానే కనిపిస్తోంది.
విక్టరీ వెంకటేశ్.. ప్రతి ఏడాది మినిమమ్ బడ్జెట్లో మ్యాగ్జిమమ్ హిట్ సినిమా ఉండేలా చూసుకుంటూ తన అభిమానులను అలరిస్తుంటారు. గతేడాది తమిళంలో విజయవంతమైన 'అసురన్'ను తెలుగులో 'నారప్ప'గా రీమేక్ చేస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరి సంయుక్త నిర్మాణంలో శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. సుమారు 50 నుంచి 60 కోట్ల రూపాయల బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనంతపురం, తమిళనాడు పరిసరాల్లో జోరుగా చిత్రీకరణ జరుపుకొంటోన్న ఈ చిత్రానికి కరోనా వైరస్ బ్రేక్ వేసింది. అయితే ఈ ఏడాది వేసవిలోనే నారప్పను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావించింది చిత్రబృందం. కానీ ఈ వైరస్ కారణంగా వేసవిలో రావల్సిన 'నారప్ప' సందిగ్ధంలో పడింది.

పవన్ కల్యాణ్ సినిమా అంటే నిర్మాతలకు కాసుల వర్షమే. పైగా చాలా విరామం తర్వాత పవన్ మళ్లీ సినిమాల్లోకి అడుగుపెట్టడం వల్ల మెగా అభిమానుల్లో ఎక్కడా లేని జోష్ వచ్చింది. ఆ జోష్ని క్యాష్ చేసుకునేందుకు శరవేగంగా సినిమాను పూర్తి చేసి మేలో విడుదల చేయాలనుకున్నారు నిర్మాత దిల్ రాజు. హిందీలో హిట్టయిన 'పింక్' రైట్స్ కొని వేణుశ్రీరామ్ దర్శకత్వంలో సినిమా మొదలుపెట్టారు. 'వకీల్ సాబ్' పేరుతో టైటిల్ అనౌన్స్ చేసి అంచనాలను పెంచేశారు. మినిమమ్ 100 కోట్ల సినిమాగా లెక్కలేసుకున్నారు. కానీ ఆ లెక్కలను మించిన తలతిక్కల వైరస్ 'వకీల్ సాబ్'కు చుక్కలు చూపిస్తోంది. జోరుగా షూటింగ్ మొదలు పెట్టిన దర్శక నిర్మాతలు పవన్తో కీలక సన్నివేశాలు ముందే చిత్రీకరించిపెట్టుకున్నారు. మిగతా నటీనటుల సన్నివేశాలను ఏప్రిల్లో పూర్తి చేసి మేలో 'వకీల్ సాబ్'ను వదులుదామని భావించారు. ఈలోగా పైరసీ కంటే ముందే వైరస్ వచ్చివాలడంతో దిల్ రాజు 100 కోట్ల ఆశ ఈ వేసవిలో నిజమయ్యేలా కనిపించడం లేదు.
ఇలా అగ్ర హీరోల సినిమాలతోపాటు మరికొన్ని చిన్న సినిమాల చిత్రీకరణలూ అర్ధాంతరంగా నిలిచిపోవడం వల్ల ఆయా సినిమాల నిర్మాతలకు వడ్డీల మీద వడ్డీలు భారంగా మారుతున్నాయి. థియేటర్ల మూసివేతతో ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు కోలుకోలేని నష్టాలను మూటగట్టుకుంటున్నారు. దీంతో కరోనా చేసిన గాయం నుంచి కోలుకోవాలంటే కనీసం ఏడాది లేదా అంతకంటే ఎక్కువే పట్టవచ్చని చిత్ర పరిశ్రమ భావిస్తోంది.