అతిలోక సుందరి శ్రీదేవి నట వారసురాలిగా వెండితెరకు పరిచయమైంది అందాల తార జాన్వీ కపూర్. తన మొదటి చిత్రం 'ధడక్'తోనే విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అందంతో పాటు నటన కూడా తన రక్తంలోనే ఉందని నిరూపించింది. శ్రీదేవి అకాల మరణం తర్వాత బాలీవుడ్లో ఆమె స్థాయిని అందిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తోన్న జాన్వీ.. ఇంట్లోనూ తన తల్లి మిగిల్చి వెళ్లిన బాధ్యతలను భుజాలకెత్తుకుంది. ఈక్రమంలో లాక్డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన ఆమె.. తండ్రి బోనీ కపూర్, సోదరి ఖుషీ కపూర్ల యోగక్షేమాలను దగ్గరుండి మరీ చూసుకుంటోంది. ఆపత్కాలంలో 'అమ్మ' లేని లోటు కనిపించకుండా వారికి కావాల్సిన అవసరాలన్నింటినీ సమకూరుస్తోంది.
అన్నీ తానై!
లాక్డౌన్ కారణంగా సినిమా షూటింగ్లకు బ్రేక్ పడడం వల్ల పూర్తిగా ఇంటికే పరిమితమైంది జాన్వీ. దీంతో తన తండ్రి, సోదరితో సరదాగా గడుపుతోంది. అందరితో కలిసి వెబ్సిరీస్లు చూస్తూ లాక్డౌన్ కాలాన్ని ఆస్వాదిస్తోంది. అయితే ఈ సమయంలో ఇంటికి పెద్ద దిక్కుగా మారిపోయింది జాన్వీ. తండ్రి, సోదరికి సంబంధించిన అన్ని విషయాలను క్షుణ్ణంగా తెలుసుకుంటోంది. అన్నీ తానై వారు తినే ఆహారం దగ్గరి నుంచి వ్యాపకాల వరకు అన్ని అవసరాలను సమకూరుస్తోంది. ఈ నేపథ్యంలో కరోనా తన ఆలోచనలను ఎలా మార్చిందో కొద్ది రోజుల క్రితం చెప్పుకొచ్చిన జాన్వీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా తన తండ్రి, సోదరి గురించి పలు ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంది.
నాది చిన్నపిల్లల మనస్తత్వం!
'అమ్మ మరణం తర్వాత నాన్న, సోదరి కొంతవరకు నాపై ఆధారపడుతున్నారని ఇప్పటివరకు నాకు తెలియలేదు. కానీ వారు నాపై ఎంతగా ఆధారపడుతున్నారో లాక్డౌన్ కారణంగా తెలుసుకున్నాను. అయితే ఇంట్లో అందరి యోగక్షేమాలు చూసుకునే మహిళనవుతానని నేనెప్పుడూ అనుకోలేదు. ఎందుకంటే నాది చిన్నపిల్లల మనస్తత్వం. గడిచిన రెండేళ్లలో ఇంత ఎక్కువ సమయం వాళ్లతో గడిపింది ఈ లాక్డౌన్లోనే. ఈ సందర్భంగా నాన్న ఏం తింటారు?, ఖుషీ ఎక్కువ సమయం ఎందుకు నిద్రపోతుంది?, ఇంట్లో ఉండే పనివాళ్లు కూరగాయలను ఎలా తీసుకువస్తున్నారు? అన్నీ శుభ్రంగా కడుగుతున్నారా? కరోనా బారిన పడకుండా ప్రభుత్వం సూచిస్తున్న నియమాలను క్రమం తప్పకుండా పాటిస్తున్నారా? ఇలా ప్రతి విషయాన్నీ పూర్తిగా నేనే పర్యవేక్షిస్తున్నాను. ఒకవేళ ఇప్పుడు నేనిక్కడ లేపోతే ఎలా ఉండేది? అని అప్పుడప్పుడూ ఆలోచిస్తుంటాను. అయితే వాళ్లు నాపై ఆధారపడుతున్నారనే విషయం నాకు అర్థమయ్యింది. దీంతో నా బాధ్యత మరింత పెరిగింది' అని ఈ సందర్భంగా చెప్పుకొచ్చిందీ ముద్దుగుమ్మ.
ఈ ఏడాది ప్రారంభంలో 'ఘోస్ట్ స్టోరీస్' వెబ్సిరీస్లో కనిపించి అలరించింది జాన్వీ. దీనితోపాటే కరీనాకపూర్, ఇర్ఫాన్ఖాన్ ప్రధాన తారగణంగా తెరకెక్కిన 'అంగ్రేజీ మీడియం'లోని ఓ పాటలో తళుక్కున మెరిసింది. గుంజన్ సక్సేనా జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న 'గుంజన్ సక్సేనా..ది కార్గిల్ గర్ల్' సినిమాతో పాటు 'రూహ్ ఆఫ్జా', 'దోస్తానా2' చిత్రాలు ఆమె చేతిలో ఉన్నాయి.