ఇంట్లో పెరిగే మందార మొక్కకు రసం పీల్చే పురుగుల సమస్య తరచూ కనిపించే అవకాశం ఉంది. ముఖ్యంగా తెల్లదోమ, పేనుబంక, దూది పేను వంటివి ఆకుల వెనక చేరి రసం పీలుస్తాయి. అదే సమయంలో అవి విసర్జించే పదార్థాలు, తేనె, ఇతరత్రా వ్యర్థాలు అన్నీ కలిసి వాటిపై శిలీంద్రాల్ని అభివృద్ధి చేస్తాయి. దాంతో ఆకుల వెనుక భాగం నల్లగా మారుతుంది. క్రమంగా ఆకులు మాడిపోయి ఎండిపోతాయి. కిరణజన్య సంయోగక్రియ జరగదు. ఆహారపదార్థాలు తయారుకావు. మందార పూలు, మొగ్గలు రాలిపోతాయి. ఒకవేళ పూలు పూసినా సైజు తగ్గడంతోపాటు పూల సంఖ్యా తగ్గిపోతుంది.
ఈ సమస్య నివారణకు లీటరు నీటికి 5 మిల్లీ లీటర్ల చొప్పున వేపనూనె కలిపి ఉదయం, సాయంత్రం వేళల్లో మొక్కపై పిచికారీ చేయాలి. కొద్దిగా బలంగా పైపు సాయంతో ఆకుల అడుగు భాగంలో స్ప్రే చేస్తే కొంత ఉద్ధృతి తగ్గుతుంది. ఈ చీడల వల్ల మొక్కకు బలం సరిపోదు కాబట్టి నీటిలో కరిగే ద్రవరూప ఎరువును తరచూ అందిస్తే పూల సంఖ్య పెరుగుతుంది. పై సమస్యతో పాటు మందారను ఎండు కొమ్మల రోగం ఇబ్బంది పెడుతుంది. ఇలాంటప్పుడు ఆకులు తీసేసి సూక్ష్మపోషకాలను పిచికారీ చేయండి.