కామారెడ్డి జిల్లా పిట్లం మండలం గుడితండాలో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తే.. భార్యను గొంతు నులిమి చంపేశాడు.
గుడితండాకు చెందిన శిరీషకు మొదట మండలంలోని గౌరారానికి చెందిన ఓ యువకుడితో పెళ్లి జరిగింది. వారిరువురి మధ్య భేదాభిప్రాయాలు తలెత్తడం వల్ల 6 నెలల్లోనే పెద్దల సమక్షంలో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత శిరీష తల్లిదండ్రులు అనారోగ్యంతో చనిపోవడం వల్ల.. శిరీష తన ఇద్దరు తమ్ముళ్లతో కలిసి గుడితండాలోనే ఉంటోంది.
ఈ క్రమంలో పిట్లంకు చెందిన శ్రీకాంత్తో శిరీషకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారటంతో ఇద్దరూ వివాహం చేసుకున్నారు. అనంతరం హైదరాబాద్కు వెళ్లి జీవిస్తున్నారు. 15 రోజుల క్రితం హైదరాబాద్ నుంచి తిరిగొచ్చారు. శిరీష పుట్టింటికి వెళ్లగా.. శ్రీకాంత్ పిట్లంలోని తన ఇంటికి వెళ్లాడు.
వచ్చినప్పటి నుంచి ఇద్దరూ తరచూ గొడవ పడుతున్నారని శిరీష బంధువులు ఆరోపించారు. బుధవారం రాత్రి కూడా ఇద్దరి మధ్య గొడవ జరిగిందని.. ఈ క్రమంలోనే శ్రీకాంత్, శిరీషను గొంతు నులిమి చంపాడని తెలిపారు.
బంధువుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. శిరీష మెడపై గొంతు నులిమిన ఆనవాళ్లను గుర్తించినట్లు సీఐ టాటాబాబు పేర్కొన్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.