రష్యా సైబీరియాలోని బంగారు గనిలో ఓ అక్రమ నిర్మిత ఆనకట్ట కూలి 15 మంది మృతి చెందారు. మరో ఏడుగురు గల్లంతయ్యారు. 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక క్రాస్నోయారస్క్ ప్రాంతంలో సైబా నదిపై ఉన్న ఆనకట్ట భారీ వర్షాలకు కూలిపోయింది. దీంతో షాచెటిన్కినో గ్రామంలో నివాసముంటున్న కార్మికుల ఇళ్లు వరదలో చిక్కుకున్నాయి.
కార్మికులు విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో ఆనకట్ట కూలిందని అధికారులు తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. దాదాపు 300 మంది సిబ్బంది, ఆరు హెలికాఫ్టర్లు, 6 పడవలు గాలింపు చర్యల కోసం రంగంలోకి దిగాయి. మారుమూల ప్రాంతం కావడం వల్ల సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది.
రష్యా అధ్యక్షుడు దిగ్భ్రాంతి
ఈ ఘటనపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు అవసరమైన సహాయాన్ని అందించాలని అధికారులను ఆదేశించారు.
ఈ ఆనకట్ట పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిందని... ఈ ప్రాంతంలో ఇదే తరహాలో నాలుగు ఆనకట్టలున్నాయని స్థానికులు ఆరోపించారు.
ఇదీ చూడండి: '18 బిలియన్ డాలర్లకు భారత్-అమెరికా రక్షణ భాగస్వామ్యం'