కరోనా వాక్సిన్ పంపిణీకి పాకిస్థాన్ చర్యలు మొదలుపెట్టింది. ఒప్పందంలో భాగంగా చైనా నుంచి వాక్సిన్ దిగుమతి చేసుకోవడానికి సమాయత్తమైంది. మొదటి దఫాగా 5 లక్షల డోసులను తీసుకురావడానికి ఆదివారం చైనాకు ప్రత్యేక విమానాన్ని పంపనున్నామని ఆ దేశ నేషనల్ కమాండ్ అండ్ ఆపరేషన్ సెంటర్ (ఎన్సీఓసీ) తెలిపింది. జనవరి 31లోపు 5 లక్షల డోసులను అందించే విధంగా చైనాతో పాక్ ఒప్పందం కుదుర్చుకుంది. చైనీస్ సినోఫార్మ్ వాక్సిన్తో కలిపి రెండు కరోనా టీకాలను అత్యవసర వినియోగానికి పాక్ ఇప్పటికే అనుమతించింది.
'వాక్సిన్ పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇస్లామాబాద్లో టీకా నిల్వచేసి అన్ని రాష్ట్రాలకు అందించనున్నాం' అని ఎన్సీఓసీ వెల్లడించింది. మొదట ఫ్రంట్లైన్ వర్కర్స్కు, వద్ధులకు వాక్సిన్ ఇవ్వనున్నట్లు తెలిపింది.
17 లక్షల డోసులు..
ఈ ఏడాది ప్రథమార్ధంలోగా పాకిస్థాన్కు 17 లక్షల ఆస్ట్రాజెనికా టీకాను అంతర్జాతీయ టీకా సమన్వయ సంస్థ 'కోవాక్స్' అందించనుందని ఆ దేశ మంత్రి అసద్ ఉమర్ ట్వీట్ చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ, గ్లోబల్ అలియన్స్ ఫర్ వాక్సినేషన్ అండ్ ఇమ్యునైజేషన్ (జీఏవీఐ) కూటమితో 'కొవాక్స్' ఏర్పడింది.
పాకిస్థాన్లో ఇప్పటి వరకు 5,43,214 కరోనా కేసులు నమోదయ్యాయి. 11,623 మంది మరణించారు. 2,111 రోగులు వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నారని ఆ దేశ ఆరోగ్య శాఖ వెల్లడించింది.
ఇదీ చదవండి:బెడిసికొడుతున్న చైనా వ్యూహం-భారత్దే పైచేయి!