కరోనాతో అమెరికా ఇంకా జీవన్మరణ పోరాటం చేస్తూనే ఉందన్నారు ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్. అయితే దానిని ఎదుర్కొనేందుకు కృషి చేస్తున్నట్టు స్పష్టం చేశారు. ప్రజలకు తన ప్రభుత్వం.. 75 రోజుల్లో 15కోట్ల డోసులు అందించిన క్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
"కరోనాతో అమెరికా ఇంకా జీవన్మరణ పోరాటం చేస్తునే ఉంది. అందరికీ వ్యాక్సిన్ అందేంత వరకూ ప్రజలు కరోనా నిబంధనలను పాటించటం మరవద్దు. మంచిరోజులు ముందున్నాయి. జులై నాటికి మనం మన కుటుంబం, స్నేహితులతో సంతోషంగా గడపబోతున్నాం."
-- జో బైడెన్, అమెరికా అధ్యక్షుడు
అధికారం చేపట్టిన నాటి నుంచి.. వంద రోజుల్లో 20 కోట్ల టీకాలు అందించడమే లక్ష్యంగా బైడెన్ బృందం ముందుకు సాగుతోంది.
ఏప్రిల్ 19 నాటికి..
ఈ నెల 19 నాటికి దేశంలో వయోజనులందరికీ టీకా అందించే దిశగా అధ్యక్షడు జో బైడెన్ సమాయత్తం అవుతున్నారని శ్వేతసౌధం ప్రెస్ సెక్రటరీ జెన్ సాకి తెలిపారు. మొదట మే 1 నుంచి వ్యాక్సిన్ అందించాలని భావించినా.. కేసులు పెరుగుతున్న క్రమంలో ఈ నెల 19 నుంచే అందరికీ టీకా ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందని వివరించారు.
వ్యాక్సిన్ తయారీ, సరఫరా ప్రక్రియను వేగవంతం చేయటంపై బైడెన్ ప్రభుత్వం దృష్టి సారించిందని అమెరికా విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి నెడ్ ప్రైస్ తెలిపారు.
అమెరికా మౌనం...
ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్ల తయారీ- సరఫరాకు అమెరికా కట్టుబడి ఉందని నెడ్ వెల్లడించారు. అయితే.. కొవిడ్-19 వ్యాక్సిన్లపై మేథోసంపత్తి హక్కులను ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీఓ) తొలగించాలని భారత్, దక్షిణాఫ్రికా వంటి దేశాలు చేసిన విజ్ఞప్తిపై మాత్రం ఆయన స్పందించలేదు.
"ఈ విషయం(వ్యాక్సిన్ల మేథోసంపత్తి)పై మాకు ఆలోచనల్లో మార్పు లేదు. కానీ ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్ తయరీ, సరఫరాపై అధ్యక్షుడు బైడెన్ దృష్టి సారించారు. అయితే.. అమెరికా ప్రజలకు వ్యాక్సిన్ అందించటమే మా ప్రథమ కర్తవ్యం. కరోనా వల్ల మేము చాలా నష్టపోయాం."
-- నెడ్ ప్రైస్, అమెరికా విదేశాంగ మంత్రి
కొవిడ్-19 కారణంగా మిగతా దేశాల కంటే అమెరికాలోనే ఎక్కువ మరణాలు సంభవించినట్లు నెడ్ ప్రైస్ తెలిపారు. అయితే అమెరికా ప్రజలకు సరిపడ వ్యాక్సిన్ డోసులు తమ దగ్గర ఉన్నాయని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి : చికాగోలో దారుణం- మూడేళ్ల బాలుడి తలపై కాల్పులు