బ్రెజిల్లో చెలరేగుతున్న మంటల ధాటికి వందల సంఖ్యలో అటవీ జంతువులు ప్రాణాలు కోల్పోయాయి. గత 47 ఏళ్లలో ఎన్నడూలేని విధంగా ప్రమాదకర స్థాయిలో పెరిగిన ఉష్ణోగ్రతల కారణంగా మంటలు చెలరేగాయి. ఈ అగ్నిలో సుమారు 200 చిరుతపులులు, సరీసృపాలు, ఇతర వన్య ప్రాణులు సజీవ దహనమయ్యాయని పాంథెరా అనే అంతర్జాతీయ అటవీ పరిరక్షణ సంస్థ తెలిపింది. ప్రపంచంలోనే అత్యంత ఉష్ణమండల చిత్తడినేలలు కలిగిన బ్రెజిల్లోని పాంటనాల్ ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగింది.

అగ్నిలో చిక్కుకొని కొట్టుమిట్టాడుతున్న జంతువులను రక్షించేందుకు సహాయక చర్యలు చేపట్టారు అధికారులు. ఇందుకోసం అక్కడే ఓ ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేసి వాటికి చికిత్స అందిస్తున్నారు.

సూర్యుణ్ని కప్పేసి..
అనేక పార్కుల్లో చెలరేగుతున్న మంటలు, దట్టమైన పొగలు సూర్యుని జాడ కనిపించకుండా చేస్తున్నాయని ఫెడరల్ యూనివర్సిటీ ఆఫ్ రియో డి జెనెరియో విడుదల చేసిన ఉపగ్రహ ఛాయాచిత్రాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నెల 12వరకు పాంటనాల్ ప్రాంతంలో భారీ స్థాయిలో అగ్ని చెలరేగగా.. గతేడాదితో పోలిస్తే ఇది మూడు రెట్లు పెరిగినట్లు తెలుస్తోంది.


ఇదీ చదవండి: మాస్కు ధరించకపోతే.. గోతులు తవ్వాల్సిందే