శ్రీవిష్ణు హీరోగా తెరకెక్కిన సినిమా 'రాజరాజచోర'. అయితే ఈ సినిమా గురించి మాకేందుకు అనుకుంటున్నారా..? అచ్చం ఆ సినిమాలో మాదిరిగానే.. మన చోరశిఖామణి కూడా దొంగతనాలు చేస్తూ.. ఓ సామ్రాజ్యాన్నే సృష్టించాడు. ఆ స్టోరీతో తీసిన సినిమాకు ఎంత ఆదాయం వచ్చిందో తెలియదు కానీ.. అదే పంథాను ఫాలో అయిన ఈ చోరుడు మాత్రం గట్టిగానే దండుకున్నాడు. ఆ రాజరాజచోరుడు, అతడి చోరసైన్యం, చోరతంత్రం.. తెలిస్తే విస్తుపోవటం పక్కా..!
ఈ ఏడాది మార్చి 7 తెల్లవారుజామున హైదరాబాద్ ఎల్బీనగర్లోని రాక్టౌన్ కాలనీలో ఒక ఇంట్లో దొంగతనం జరిగింది. ఇంట్లోని బంగారు ఆభరణాలు, నగదు పోయింది. అదే కాలనీలోని ఓ ఫార్మసీ కార్యాలయంలోనూ నగదు చోరీ అయ్యింది. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసిన పోలీసులు దొంగల వేట ప్రారంభించారు. ఎప్పటిలాగే.. సీసీ కెమెరాల దృశ్యాల ఆధారంగా.. నిందితుల ఆనవాళ్లు గుర్తించారు. నిందితులు హోండా యాక్టివా స్కూటీ వాడినట్టు దృశ్యాల్లో కనిపించటంతో.. బండి ఆధారాలతో జగన్నాథ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయగా.. మరోకరు పరారీలో ఉన్నాడు. నిందితుని దగ్గర నుంచి 440 గ్రాముల బంగారు ఆభరణాలు, 568 గ్రాముల వెండి, 25 వేల నగదు, ఓ కారు, 21 యూఎస్ డాలర్లు, 26 చేతి గడియారాలు, ఆరు మొబైల్ ఫోన్లు, స్క్రూడైవర్ స్వాధీనం చేసుకున్నారు. వీటన్ని విలువ 32 లక్షలకు పైమాటే. ఇదంతా ఎలా చేస్తున్నారని పోలీసులు.. వాళ్ల స్టైల్లో జగన్నాథ్ను విచారించగా.. మొత్తం కథ బయటపడింది.
![rachakonda police arrested a thief who are doing thefts in raja raja chora movie style](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tg-hyd-er-01-11-rachakondapolice-arested-interstate-offender-jail-bail-pressmeet-pkg-1078039_11042022190501_1104f_1649684101_1021.jpeg)
కర్ణాటకలోని కడిగహడ్డి గ్రామానికి చెందిన జగన్నాథ్(28) ఓ కారు డ్రైవర్. దోపిడీలు, దొంగతనాలు చేయటంలో మంచి నిపుణుడు. 2017, 2019, 2021లో వేర్వేరు ప్రాంతాల్లో కర్ణాటక పోలీసులు అరెస్ట్ చేసి జ్యుడీషియల్ రిమాండ్కు పంపారు. 2022 ఫిబ్రవరి 10న బెయిల్పై బయటకు వచ్చాక మళ్లీ చోరీల బాట పట్టాడు. అయితే.. ఘరానాదొంగ అయిన ఈ జగన్నాథ్ కేవలం పాత్రధారి మాత్రమే.. అసలు సూత్రధారి మాత్రం పరారీలో ఉన్న రాజశ్రీ గణేశ్. హైదరాబాద్లోని ఫీర్జాదిగూడకు చెందిన బ్రహ్మదేవ్ అలియాస్ బ్రహ్మదేవర రాజయ్య అలియాస్ రాజా శ్రీ గణేశే.. అసలైన రాజరాజచోరుడు. రాజశ్రీ గణేశ్ను 2014లో మియాపూర్, 2018లో ఎల్బీనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. గణేశ్పై దొంగతనాల కేసులతో పాటు వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు ఫిర్యాదులున్నాయి. జైలుకెళ్లొచ్చినా పద్ధతి మారకపోవటంతో ఇతనిపై రాచకొండ పోలీసులు పీడీయాక్ట్ ప్రయోగించారు. ఏడాది పాటు జైల్లో ఉన్న గణేశ్.. బయటకు వచ్చాక.. సరికొత్త పంథాను అనుసరిస్తున్నాడు.
![rachakonda police arrested a thief who are doing thefts in raja raja chora movie style](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tg-hyd-er-01-11-rachakondapolice-arested-interstate-offender-jail-bail-pressmeet-pkg-1078039_11042022190501_1104f_1649684101_350.jpeg)
ధనుంజయ్ అనే మిత్రుని ద్వారా జగన్నాథ్ గురించి గణేశ్ తెలుసుకున్నాడు. జైలు నుంచి బయటకు వచ్చిన గణేష్.. నేరుగా బెంగళూరు చేరాడు. జైలులో ఉన్న జగన్నాథ్ను బెయిల్పై బయటకు తీసుకొచ్చాడు. తన తంత్రాన్ని మొత్తం జగన్నాథ్కు వివరించాడు. ఇంకేముంది.. ఇద్దరూ కలిసి ఏపీ, తెలంగాణపై దండయాత్ర ప్రకటించారు. పగటి వేళల్లో గణేశ్ హోండా యాక్టివాపై తిరుగుతూ.. తాళం వేసిన ఇళ్లను గుర్తిస్తాడు. చోరీ చేసేందుకు అనుకూలంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి రెక్కీ నిర్వహిస్తాడు. నగరం నిద్రపోతున్న వేళ.. ఇద్దరూ యాక్టివాపై బయల్దేరాతారు. రెక్కీ చేసిన ఇంటికి సమీపంలో స్కూటీని నిలిపేసి నడచుకుంటూ వెళ్తారు. గణేశ్ బయట కాపలా ఉంటే.. జగన్నాథ్ ఐరన్రాడ్/స్కూడ్రైవర్తో తాళం తీసి ఇళ్లు గుల్ల చేస్తాడు. ఇది వాళ్లు పాటించే పద్ధతి. కాగా.. కొట్టేసిన సొత్తును ఇద్దరు సగం సగం పంచుకునేవారు. సెల్ఫోన్ వినియోగిస్తే పోలీసులకు పట్టుబడతామనే ఉద్దేశంతో.. కేవలం వాట్సాప్ ద్వారానే ఇద్దరు సమాచారం ఇచ్చిపుచ్చుకునేవారు.
![rachakonda police arrested a thief who are doing thefts in raja raja chora movie style](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tg-hyd-er-01-11-rachakondapolice-arested-interstate-offender-jail-bail-pressmeet-pkg-1078039_11042022190501_1104f_1649684101_476.jpeg)
దొంగిలించిన సొత్తుతో నిందితులు ఓఎల్ఎక్స్ ద్వారా ఫోర్డ్ ఫిగో కారు(ఏపీ29ఏఎల్1593) కొనుగోలు చేశారు. కారులోనే ఏపీ, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలు చుట్టొచ్చారు. తిండి, నిద్ర.. అంతా కారులోనే. ప్రొద్దుటూర్, బంజారాహిల్స్, బళ్లారి ప్రాంతాల్లోని ఇళ్లను రెక్కీ చేసి దొంగతనాలు చేశారు. కర్ణాటక, తెలంగాణ, ఏపీలోని పలు పోలీస్స్టేషన్లలో వీరిపై దొంగతనాల కేసులు నమోదయ్యాయి. ఎల్బీనగర్లో చేసిన దొంగతనంతో పోలీసులు వీరి ఆటకట్టించారు. అయితే.. రాజశ్రీ గణేశ్.. జగన్నాథ్లాగే మరికొందరిని కూడా బెయిల్ ఇప్పించి బయటకు తీసుకొచ్చాడని దర్యాప్తులో వెల్లడైంది. ప్రస్తుతం పరారీలో ఉన్న గణేశ్ పట్టుబడితే.. ఎంతమంది నిందితులకు బెయిలిప్పించి బయటకు తీసుకొచ్చాడు...? ఎన్ని ప్రాంతాల్లో దొంగతనాలు, దోపిడీలు చేయించాడు..? అన్న వివరాలు బయటకు వస్తాయని పోలీసులు చెబుతున్నారు.
![rachakonda police arrested a thief who are doing thefts in raja raja chora movie style](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tg-hyd-er-01-11-rachakondapolice-arested-interstate-offender-jail-bail-pressmeet-pkg-1078039_11042022190501_1104f_1649684101_361.jpeg)
ఇదీ చూడండి: