మంచిర్యాల జిల్లా తాండూరు మండలం ఐబీ చౌరస్తాలో రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొట్టడంతో డ్రైవర్లు క్యాబిన్లో ఇరుక్కుపోయారు. దాదాపు రెండు గంటలపాటు శ్రమించిన పోలీసులు ఇద్దరు డ్రైవర్లనూ సురక్షితంగా బయటకు తీశారు. ఐబీ కేంద్రంలో మధ్యాహ్నం రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. నిజామాబాద్ నుంచి చంద్రాపూర్ వైపు పసుపు లోడుతో వెళ్తున్న లారీ, చంద్రపూర్ నుంచి బెల్లంపల్లి వైపు వస్తున్న మరో లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో క్యాబిన్లో డ్రైవర్లు గణేష్, సయ్యద్ సమద్ ఇరుక్కున్నారు.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న సీఐ బాబురావు, ఎస్సై శేఖర్ రెడ్డి జెసీబీల సహాయంతో డ్రైవర్లను సురక్షితంగా బయటకు తీశారు. తీవ్రంగా గాయపడిన సయ్యద్ సమద్ను బెల్లంపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. లారీలను అక్కడి నుంచి తొలగించారు. గణేష్ మద్యం సేవించి లారీ నడపడంతో ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: మొన్న భర్త.. నేడు భార్య.. అనాథలైన చిన్నారులు