నకిలీ, నాసిరకాలను కట్టడి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ విస్పష్టమైన ఆదేశాలిచ్చిన నేపథ్యంలో ఈ బృందాలు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నాయి. విత్తన విక్రయ మార్కెటింగ్ పేరుతో లైసెన్సులు ఎవరు తీసుకున్నారు? వారు అసలు ఈ రంగంలో ఉన్నవారేనా? కాదా? వారి పూర్వాపరాలేమిటి? కార్యకలాపాల సరళి ఎలా ఉంటోంది? లైసెన్సు తీసుకొని దానిని అడ్డం పెట్టుకొని నకిలీ వ్యాపారానికి తెరలేపుతున్నారా తదితర వివరాలు ఇంతకాలం వ్యవసాయశాఖ సేకరించకపోవడంతో అక్రమంగా అమ్మేవారిని పట్టుకోవడం కష్టంగా మారింది. కొందరు వ్యాపారులు అనామక కంపెనీల పేరుతో లైసెన్సులు తీసుకుని గడువు తీరిన నాసిరకం విత్తనాలు అమ్ముతున్నారు. ఈ కంపెనీలపై ఆరా తీస్తే మరిన్ని అక్రమాలు బయటికొస్తాయని అంచనా. సాధారణ పంటనే ప్రముఖ కంపెనీల పేర్లతో ప్యాక్ చేసి విక్రయిస్తున్నారు. ఇటీవల జరిగిన దాడుల్లో ఈ విషయాలను గుర్తించారు. ఈ వ్యాపారుల వద్ద లంచాలు తీసుకుని సహకరించే వ్యవసాయాధికారుల వివరాలను సేకరించి నిఘా పెట్టాలని వ్యవసాయశాఖ తాజాగా నిర్ణయించింది.
ఐదు రోజుల క్రితం...
- ఉదాహరణకు 5 రోజుల క్రితం నగరంలోని మీరాలం మండీలో ఓ దుకాణంలో కూరగాయల విత్తనాలు అమ్ముతుంటే టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్ల నుంచి సాధారణ పంటలనే తెచ్చి ఇక్కడ ప్యాక్ చేసి అమ్ముతున్నట్లు తేలింది. ఈ విత్తనాలను నాటితే కూరగాయ పంటలేవీ సరిగా రావని తనిఖీల్లో తేలింది. ఈ వానాకాలంలో విత్తనాలు విక్రయించాలంటే వాటిని గతేడాది విత్తన పంటగా పండించాలి. చాలాచిన్న కంపెనీలు అసలు విత్తన పంటలు పండించకుండానే నేరుగా వ్యవసాయ మార్కెట్లలో పంటలను కొని విత్తనాల పేరుతో ప్యాక్ చేసి అమ్మేస్తున్నాయి.
- ఇటీవల హైదరాబాద్ శివారులోని మేడ్చల్ జిల్లాలో పోలీసులు, వ్యవసాయాధికారులు నిర్వహించిన తనిఖీల్లో 474 క్వింటాళ్ల వరి, మొక్కజొన్న విత్తనాల బస్తాలు దొరికాయి. వీటిని నాటడానికి ఇచ్చిన గడువు తీరిపోయింది. అలాగే ప్రభుత్వ అనుమతి లేని వంగడాలను సైతం నగరానికి దగ్గరలో ఉన్న మహబూబ్నగర్ జిల్లాలో 13,403 క్వింటాళ్లు పట్టుకున్నారు.
- మెదక్ జిల్లా రామాయంపేటలో పోలీసులు చేపట్టిన తనిఖీల్లో ఒక దుకాణంలో కాలం చెల్లిన 80 విత్తన ప్యాకెట్లు పట్టుకున్నారు. ఈ తనిఖీలు చేయకపోతే వాటిని రైతులకు విక్రయించేవాడినని దుకాణ యజమాని విచారణలో చెప్పడంతో కేసు పెట్టారు. పోలీసులు వెళ్లేదాకా వ్యవసాయాధికారి వీటిని తనిఖీ చేసి ఎందుకు పట్టుకోలేదనేది ప్రశ్నార్థకంగా మారింది.
శుద్ధి ప్లాంట్లు కూడా లేకుండానే...
రాష్ట్రంలో దాదాపు 900 మంది వ్యాపారులు లైసెన్సులు తీసుకొన్నారు. ఇందులో సుమారు 300 లైసెన్సులు నగరం చుట్టుపక్కల రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, సిద్దిపేట, యాదాద్రి జిల్లాల పరిధి గ్రామాలలోనివే. వాస్తవానికి వీటిలో ప్రముఖ కంపెనీలు మాత్రమే పక్కాగా పనిచేస్తున్నాయి. కొన్నింటికి విత్తన శుద్ధి ప్లాంట్లు కూడా లేవు. ఇక్కడి ప్రముఖ కంపెనీలే కాకుండా, ఇతర రాష్ట్రాల కంపెనీలు సైతం నాణ్యత లేదని తిరస్కరించిన విత్తనాలను ప్యాక్ చేసి అమ్ముతున్నారు. ఎక్కడో శుద్ధి చేసి ఇక్కడ ప్యాక్ చేస్తున్నట్లు చెబుతున్నారు.
ఇదీ చదవండి: కొవిడ్ నుంచి కోలుకున్న వారిలో కొత్త రకం వ్యాధి!