హైదరాబాద్ మహానగర పాలక సంస్థ పరిధిలో బస్తీవాసులకు మెరుగైన వైద్యం అందించాలని బల్దియా నిర్ణయించింది. ఇందుకోసం గ్రేటర్ వ్యాప్తంగా బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేస్తోంది. ఇప్పుడున్నవి కాకుండా ఈ నెల 14 న మరో 26 బస్తీ దవాఖానాల్ని మంత్రులు ప్రారంభించనున్నారు. హైదరాబాద్ జిల్లా పరిధిలో 18, మేడ్చల్ జిల్లాలో 6, రంగారెడ్డి జిల్లాలో 2 చొప్పున ఆసుపత్రులు అందుబాటులోకి తేనున్నారు. వీటితో జీహెచ్ఎంసీ పరిధిలో బస్తీ దవాఖానాల సంఖ్య 196కి చేరనుంది. ఇప్పటివరకు ఉన్న ఆసుపత్రుల ద్వారా సుమారు 14 వేల మందికి సేవలు అందుతున్నాయి. కొత్తగా ప్రారంభించే 26 దవాఖానాలతో మరో 2 వేల మందికి వైద్యం అందనుంది.
57 వైద్య పరీక్షలు కూడా...
జీహెచ్ఎసీ పరిధిలోని హైదరాబాద్ జిల్లాలో 95, రంగారెడ్డి జిల్లాలో 32, మేడ్చల్ జిల్లాలో 40, సంగారెడ్డి జిల్లాలో 3 చొప్పున 170 బస్తీ ఆసుపత్రులు ఇప్పటికే సేవలందిస్తున్నాయి. ఒక్కో బస్తీ దవాఖానాలో వైద్యుడు, నర్సు, సహాయకుడు ఉంటారు. సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 9 నుంచి సాయంత్రం 4గంటల వరకు వైద్య సేవలు అందిస్తున్నారు. ఇవి కాకుండా మరో 85 అర్బన్ హెల్త్ సెంటర్లు మహానగర ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నాయి. బస్తీ దవాఖానాల్లో అవుట్ పేషెంట్తో పాటు కనీస వైద్య పరీక్షలైన బీపీ, షుగర్ సహా 57 రకాల వైద్య పరీక్షలను కూడా నిర్వహిస్తారు. ఇక్కడ సేకరించిన రక్త నమూనాలను తెలంగాణ స్టేట్ డయాగ్నస్టిక్స్కు పంపించి ఫలితాలు నిర్ధరిస్తారు. 150 రకాల మందులను ఉచితంగా అందిస్తారు.
వార్డుకు రెండు దవాఖానాలు..
స్వల్పకాల అనారోగ్యం కలిగే వారికి తక్షణ వైద్య చికిత్సలు అందించడంతోపాటు టీకాలు వేయడం.. కుటుంబ నియంత్రణ వైద్య పరమైన కౌన్సిలింగ్ ఇవ్వడం వంటి చర్యలు కూడా ఇక్కడ చేపడుతారు. రాబోయే రోజుల్లో ప్రతివార్డుకు రెండు బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది.