కరోనా మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తోంది. ఈ సమయంలో వైరస్ బారిన పడినవారి నమూనాలు పరీక్షలకని వివిధ ప్రాంతాలకు తీసుకువెళ్లాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో హైదరాబాదులో పదిహేను రోజుల క్రితం ప్రారంభించిన మొబైల్ వైరాలజీ ల్యాబ్తో ఇక అలాంటి సమస్య ఉండబోదు. అత్యవసరమైన పరిస్థితుల్లో అవసరమైన చోటుకు ఈ ప్రయోగశాలను భారీ ట్రక్కుపై ఎక్కించి తరలించవచ్చు. సైనిక అవసరాల కోసం కూడా ఉపయోగించవచ్చు. ఇందులో మూడు విడతల్లో రోజుకు వెయ్యి పరీక్షలు చేయవచ్చు.
క్లిష్ట సమయంలో ఇంత ముఖ్యమైన ఆవిష్కరణ వెనుక ఉన్న కీలకవ్యక్తి జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లికి చెందిన డాక్టర్ కె.మధుమోహన్రావు. తండ్రి చిరు వ్యాపారి. అతి సామాన్య కుటుంబం నుంచి వచ్చిన యువ వైద్యుడు భారత్లో బీఎస్ఎల్-3 ప్రమాణాలతో మొట్టమొదటి కదిలే వైరాలజీ ప్రయోగశాలను ఏర్పాటు చేయడం విశేషం. ఈయన సోదరుడు, అక్కలు కూడా ఉన్నత చదువులు చదివి స్థిరపడ్డారు.
మధుమోహన్రావు భార్య పేరు రితిక, వీరికి ఇద్దరు పిల్లలు. తల్లిదండ్రులు కె.లక్ష్మీబాయి, కె.వెంకటరమణరావు ఉండవల్లిలోనే ఉంటారు. ఉస్మానియా నుంచి మైక్రోబయాలజీలో ఎమ్మెస్సీ చేసిన మధుమోహన్రావు ఉన్నతవిద్యకు విదేశాలకు వెళ్లారు.విదేశాల్లో 13 ఏళ్లపాటు పనిచేశాక ప్రస్తుతం నిమ్స్ వైద్యశాలలో విధులు నిర్వహిస్తున్నారు.
బహుళ ప్రయోజనకారి....
అమెరికా, యూరప్ వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో మాత్రమే ఇటువంటి ప్రయోగశాలలు ఉన్నాయి. మన వైద్యులు, ఇంజినీర్లు, శాస్త్రవేత్తలు మేధోమథనంతోనే ఇది సాధ్యమైంది. ఆరు నుంచి ఏడు నెలల్లో తయారుచేయాల్సిన కంటైనర్ ల్యాబును కేవలం 15 రోజుల్లో అందరి సహాయంతో పూర్తి చేశాం. కరోనా పరీక్షలకే కాకుండా ఇతర వైరస్ వ్యాధి నిర్ధరణ పరీక్షలకు, పరిశోధనల కోసం కూడా ఈ ప్రయోగశాలను ఉపయోగించవచ్చు.
- డా. కె.మధుమోహన్ రావు