Jagananna Smart Township Launch : మధ్యతరగతి వారికి లాభాపేక్ష లేకుండా మార్కెట్ ధర కన్నా తక్కువకే ఇళ్లస్థలాలు అందించే జగనన్న స్మార్ట్ టౌన్షిప్ కార్యక్రమాన్ని ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. ఇళ్ల స్థలాల కోసం నేటినుంచి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరించనున్నారు. 18 లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చన్న సీఎం.. కంప్యూటరైజ్డ్ లాటరీ ద్వారా ప్లాట్లు కేటాయించనున్నట్లు తెలిపారు. మూడు రకాల ప్లాట్లను లేఔట్లలో అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు సీఎం తెలిపారు. మొత్తం 4వాయిదాల్లో ఏడాదిలోపు నగదు చెల్లించవచ్చని వివరించారు.
అత్యంత పారదర్శకంగా కేటాయిస్తాం..
Jagananna Smart Township : అత్యంత పారదర్శకంగా ప్లాట్ల కేటాయింపు జరుగుతుందని ఏపీ సీఎం జగన్ అన్నారు. అర్హులైన కుటుంబాలకు సరసమైన ధరలకు నివాస స్థలాలు కేటాయిస్తారని పేర్కొన్నారు. అవసరం మేరకు 150, 200, 240 గజాల స్థలం ఎంచుకునే వెసులుబాటు కల్పించినట్లు తెలిపారు. ఏడాది కాలంలో వీటిని అభివృద్ధి చేస్తారు. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి లేఅవుట్లో 10% పాట్లు, 20% రిబేటుతో కేటాయిస్తారు. నిర్దేశిత మొత్తాన్ని ఏడాది కాలంలో నాలుగు వాయిదాల్లో చెల్లించే వెసులుబాటు ఉంటుందని అన్నారు. ఏకమొత్తంగా చెల్లించే వారికి 5% మేరకు రాయితీ కల్పిస్తామని స్పష్టం చేశారు. అన్ని రకాల వసతులతో టౌన్షిప్లను అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు.