తెరాస ప్రభుత్వానికి కుటుంబ ప్రయోజనాలు తప్పితే అణగారిన ప్రజలను పట్టించుకోవట్లేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ధ్వజమెత్తారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో సంత్ సేవాలాల్ మహారాజ్ 281వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెరాస ప్రభుత్వం ఎస్టీల్లోని భిన్నవర్గాల మధ్య తగవులు పెడుతోందని మండిపడ్డారు. హక్కుల కోసం లంబాడీలు పోరాడుతుంటే కేసీఆర్కు పట్టడంలేదని దుయ్యబట్టారు.
అది తండ్రి కొడుకుల పార్టీ... ఇది తల్లి కొడుకుల పార్టీ
సంత్ సేవాలాల్ చిత్ర పటానికి లక్ష్మణ్తోపాటు ఎమ్మెల్సీ రాంచందర్ రావు, మాజీ మంత్రులు మోత్కుపల్లి నర్సింహులు, రవీంద్రనాయక్, ప్రేమేందర్ రెడ్డి తదితరులు నివాళులర్పించారు. లంబాడీ సమాజానికే కాకుండా హైందవ సమాజానికి సేవాలాల్ ఎంతో కృషి చేశారని లక్ష్మణ్ పేర్కొన్నారు. భాజపా ఎస్సీని రాష్ట్రపతిని, పార్టీ జాతీయ అధ్యక్షుడిని చేసిందన్నారు.
తెరాస తండ్రి కొడుకుల పార్టీగా... కాంగ్రెస్ తల్లీ కొడుకుల పార్టీగా మారిపోయిందన్నారు. ఎన్నికలు వస్తే తప్ప రైతు బంధు రాదని ఎద్దేవా చేశారు. సంత్ సేవాలాల్ స్ఫూర్తితో 8వ నిజాం కేసీఆర్ను ఎదుర్కొంటామని లక్ష్మణ్ స్పష్టం చేశారు.