స్టాక్ మార్కెట్పై అధికంగా ఆధారపడే అమెరికా ఆర్థిక వ్యవస్థ నీటిని మార్కెట్ వస్తువుగా మార్చివేసింది. వాల్స్ట్రీట్ స్టాక్ ఫ్యూచర్ మార్కెట్లో అధికారికంగా నీటి ట్రేడింగ్ మొదలైంది. చమురు, వివిధ ఆహార ధాన్యాలు, బంగారం తదితర విలువైన లోహాలపై ఫ్యూచర్స్ మార్కెట్లో అమ్మకాలు, కొనుగోలు చేస్తుంటారు. తాజాగా అమెరికాలోని షికాగోకు చెందిన సీఎంఈ గ్రూపు వాల్స్ట్రీట్ ఫ్యూచర్స్ ట్రేడింగ్లో నీటిని కూడా చేర్చింది. వాతావరణ మార్పులు.. నీటి ఎద్దడి.. ప్రపంచ వ్యాప్తంగా నీళ్ల ధరలు పెరగటం ఈ నిర్ణయాలకు కారణం అంటున్నారు.
కరవు, అడవులు తగలబడి పోతుండటంతో.. కాలిఫోర్నియాలో ఏడాదిలో నీటి ధరలు రెట్టింపయ్యాయి. సీఎంఈ కంపెనీ కాలిఫోర్నియాలో నీటి సరఫరాకు కాంట్రాక్టు సంపాదించుకుంది. తాజాగా ట్రేడింగ్ మొదలెట్టింది. ఫ్యూచర్స్ మార్కెట్లో ట్రేడింగ్ కారణంగా బంగారం, చమురు ధరలు ఎలాగైతే రోజురోజుకూ మారుతూ ఉంటాయో.. ఇక మీదట నీటి ధర కూడా అలాగే మారుతుంటుంది. భవిష్యత్లో నీటి ధరలపై పెట్టుబడిదారులు పెట్టుబడులు పెట్టొచ్చు.
నీటిని స్టాక్ మార్కెట్ వస్తువుగా మార్చటంపై విభిన్న వాదనలు వినిపిస్తున్నాయి. రైతులు, మున్సిపాలిటీలు ముందే నీటి అవసరాలు, వాటి బడ్జెట్పై ప్రణాళికా బద్ధంగా నడచుకోడానికి ఈ ట్రేడింగ్ ఉపయోగపడుతుందనే వారు కొందరైతే.. కనీస మానవ హక్కైన నీటిని ఆర్థిక సంస్థలు, పెట్టుబడి దారుల చేతుల్లో పెట్టడం విపరీత పరిణామాలకు దారి తీస్తుందనేవారు మరికొందరు. "కోట్ల మంది ఆకలి దప్పికలను కొంతమంది డబ్బు చేసుకోబోతున్నారు" అని కాలిఫోర్నియాలోని వాతావరణ మార్పుల పరిశోధకుడు బసవసేన్ వ్యాఖ్యానించారు. 2050కల్లా మూడింట రెండొంతుల ప్రపంచ దేశాల్లో నీటి కొరత ఏర్పడుతుందంటున్నారు. ఈ నేపథ్యంలో.. నీటికి స్టాక్ మార్కెట్ ట్రేడింగ్లో భాగం చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇదీ చూడండి: 'టెక్నాలజీ సాయంతో వ్యాపార రంగంలో సరికొత్త మార్పులు'