కరోనా వైరస్ బాధితులకు ఉపశమనం కలిగిస్తున్న యాంటీ-వైరల్ ఔషధం 'రెమిడెసివిర్' త్వరలోనే భారత విపణిలోకి తీసుకువచ్చేందుకు ముమ్మర చర్యలు చేప్టటింది అమెరికా సంస్థ గిలీడ్ సైన్సెస్. త్వరలోనే భారత కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థ (సీజీఎస్సీఓ)కు దరఖాస్తు చేసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. ఈ మేరకు గిలియాడ్ సైన్సెస్ ప్రతినిధులు బుధవారం (మే 20న) కేంద్ర ఆరోగ్య శాఖ, డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అధికారులుతో సమావేశమైనట్లు వెల్లడించారు. భారత విపణిలోకి ఏ విధంగా తీసుకురావాలనే అంశంపై చర్చించినట్లు తెలిపారు.
" భారత్లోకి రెమిడెసివిర్ డ్రగ్ను తీసుకొచ్చేందుకు మార్కెట్ అనుమతులకు దరఖాస్తు చేయాలని అమెరికా సంస్థ ఆసక్తి చూపుతోంది. నూతన ఔషధానికి అనుమతులు ఇచ్చే రెగ్యులేటరీ విధానాలు వారికి తెలియజేశాం. మొత్తం సౌకర్యాలపై వివరించాం. బోర్డు డైరెక్టర్లతో చర్చించి వివరాలు తెలియజేస్తామని సంస్థ ప్రతినిధులు తెలిపారు. అమెరికా ఎఫ్డీఏ లేదా ఇతర గుర్తింపుపొందిన రెగ్యులేటరీలు ఆమోదం తెలిపిన వివరాల ఆధారంగా.. కొత్త ఔషధం, క్లినికల్ ట్రయల్స్ నియమాలు 2019లోని ప్రత్యేక పరిస్థితుల్లో క్లినికల్ ట్రయల్స్కు మినహాయింపునిస్తూ రెమిడెసివిర్కు అనుమతించే అవకాశం ఉంది. రెమిడెసివిర్ సామర్థ్యంపై ఇటీవలి ఉమ్మడి పర్యవేక్ష బృందంతో సమావేశంలో చర్చించాం."
– అధికారవర్గాలు
జులై చివరిలో..
గిలీడ్ సైన్సెస్ ఇప్పటికే రెమెడెసివిర్ ఔషధం తయారీ, విక్రయాల్లో మూడు భారతీయ ఔషధ కంపెనీలను భాగస్వాములుగా చేర్చుకుంది. ఈ మేరకు ఆయా సంస్థలతో నాన్-ఎక్స్క్లూజివ్ లైసెన్సింగ్ ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో ముంబయి కేంద్రంగా పనిచేస్తున్న సిప్లా, హైదరాబాద్ కేంద్రంగా ఉన్న హెటిరో ల్యాబ్స్, నోయిడాలో ఉన్న జుబిలెంట్ లైఫ్ సైన్సెస్ ఉన్నాయి.కేంద్రం నుంచి ఈ నెలలోనే అనుమతులు లభిస్తే.. జులై లేదా ఆగస్టులో సరఫరా ప్రారంభించే అవకాశం ఉంది.
ఎయిమ్స్లోని 1000 మంది రోగులపై ట్రయల్స్ చేసేందుకు రెమెడెసివిర్ సరఫరా చేయాలని కొద్ది రోజుల క్రితం గిలీడ్కు కేంద్ర ఆరోగ్య శాఖ లేఖ రాసింది. కానీ, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో పలు సంస్థలు చేస్తున్న క్లినికల్ ట్రయల్స్లో పాల్గొనాలని మే 12న వెల్లడించింది సంస్థ.