దేశంలో కొవిడ్ కేసులు రోజుకు 3.30 లక్షల వరకు నమోదవుతున్నాయి. గాలి ద్వారా కూడా వైరస్ వ్యాపిస్తోంది కనుక, ఇంటిలోనూ మాస్క్ ధరిస్తే ప్రయోజనకరమని ప్రభుత్వ ఆరోగ్య శాఖ పేర్కొంటోంది. ఈ పరిస్థితుల్లో ఎయిర్ కండీషనర్ల (ఏసీ) వాడకం ఎంతవరకు సురక్షితం, బ్యాక్టీరియా నిరోధానికి యూవీ నానో టెక్నాలజీ ఏ విధంగా ఉపకరిస్తుందనే అంశాలను కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా విభాగాధిపతి విజయ్బాబు 'ఈనాడు' ఇంటర్వ్యూలో వివరించారు. ముఖ్యాంశాలివీ..
ఏసీ అమ్మకాల విపణి స్థాయి ఎంత.. ఈసారి అమ్మకాలు పెరగొచ్చా, తగ్గొచ్చా?
దేశీయంగా ఏసీల వార్షిక అమ్మకాలు 60 లక్షల మేర జరుగుతున్నాయి. ఇందులో జనవరి-జూన్లోపే 65 శాతం విక్రయమవుతాయి. ఏసీ విపణిలో ఎల్జీ వాటా 21 శాతం ఉంటుంది. జనవరి-మార్చిలో 7 లక్షల యూనిట్లు విక్రయించాం. వేడి బాగా ఎక్కువగా ఉన్నందున, ఇప్పుడు పరిమిత లాక్డౌన్ వంటి ఆంక్షలున్నా, ఏసీల అమ్మకాలు విపరీతంగా సాగుతున్నాయి. ఇళ్లలో పడక గదులతో పాటు హాలులో కూడా పెట్టుకునే వారి సంఖ్య పెరిగింది.
బ్యాక్టీరియా నుంచి ఏసీలు రక్షణ కల్పిస్తాయా?
స్ల్పిట్ ఏసీలను ఇళ్లు/కార్యాలయాల్లో ఎక్కువ సంఖ్యలో అమర్చుకున్నా, ఇబ్బంది ఉండదు. ఎయిమ్స్ డైరెక్టర్ కూడా ఏసీ వల్ల వైరస్ వ్యాపించదనే చెప్పారు. సమర్థంగా బ్యాక్టీరియాను సంహరించే (స్టెరిలైజ్ చేసే) వ్యవస్థలను ఇళ్లు, కార్యాలయ ప్రాంగణాల్లో అమర్చుకుంటే మేలు. ఎల్జీ సంస్థ యూవీ (అతినీల లోహిత కిరణాల) నానో సాంకేతికతతో డ్యూయల్కూల్ ఇన్వర్టర్ మోడళ్లను ఆవిష్కరించింది. వ్యాధికారక బ్యాక్టీరియా వ్యాపించకుండా ఇది నివారిస్తుంది.
యూవీ నానో ఎలా పనిచేస్తుంది?
ఏసీ ఇండోర్ యూనిట్లో యూవీ నానో టెక్నాలజీ కలిగిన 4 ఎల్ఈడీ బల్బులు ఫ్యాన్ కింది భాగంలో ఉంటాయి. ఎల్ఈడీల నుంచి వచ్చే కాంతి ఫ్యాన్ను స్టెరిలైజ్ చేస్తుంది. అందువల్ల ఫ్యాన్ ఉపరితలంపై జెమ్స్ వంటివి అంటుకుపోకుండా 99.99 శాతం నివారిస్తాయి. ఇది ప్రయోగశాలల్లో ప్రామాణిక పరిస్థితుల్లో నిర్థారించారు. అందువల్ల ఏసీలో నుంచి వచ్చే చల్లటి గాలి శుభ్రంగా, తాజాగా ఉంటుంది. యూవీ నానోను వినియోగించినప్పుడల్లా పరిశుభ్రమైన గాలే వస్తుంది.
బ్యాక్టీరియా నివారణ కోసం వాడుతున్న యూవీ వల్ల ఆరోగ్యానికి చేటు కలగదా?
యూవీ లైట్లు ఇండోర్ యూనిట్ లోపలి భాగంలో ఉంటాయి. వీటి నుంచి కాంతి తరంగాలు రేడియేషన్ మాదిరిగా ఉంటాయి. ఇవి మానవుల కంటికి కనపడవు కనుక, ఇబ్బందేమీ ఉండదు. ఎలక్ట్రో మాగ్నటిక్ స్పెక్ట్రమ్లో భాగంగా ఇవి ఉంటాయి. ఏసీల్లో వినియోగిస్తున్న యూవీసీ అనేది యూవీ లైటులో తక్కువ పౌనఃపున్యం కలిగింది. అందువల్ల మానవ శరీరానికి హానికరం కాదు. బ్యాక్టీరియా క్రియాశీలకంగా లేకుండా చేయడానికి ఇవి ఉపయోగపడుతుంటాయి.
యూవీ నానో పరిజ్ఞానాన్ని ఇంకా ఏమైనా పరికరాల్లో వినియోగిస్తున్నారా?
ఈ ఏడాదిలో ఆవిష్కరించిన 5 ఏసీ మోడళ్లలో యూవీ నానో టెక్నాలజీ ఉంది. ఏసీ ఆన్ చేసినపుడు యూవీ నానో కూడా వాడేందుకు రిమోట్లో ప్రత్యేకంగా ఒక బటన్ ఉంటుంది. ఏసీ పనిచేస్తున్నప్పుడు యూవీ నానో ఆన్ చేసి ఉంచితేనే ప్రయోజనం. ఏసీ ఇండోర్ యూనిట్పై సూచిక కూడా ఉంటుంది కనుక, యూవీ నానో పనిచేస్తుందో లేదో తెలిసిపోతుంది. నీటి శుద్ధి పరికరాలు (వాటర్ ప్యూరిఫైయర్స్)లో కూడా ఈ సాంకేతికత వాడుతున్నాం.
బ్యాక్టీరియా నుంచి ఇవి ఎంతవరకు రక్షిస్తాయి.. సాధారణ ఏసీలతో పోలిస్తే ధర ఎంత తేడా ఉంటుంది?
కార్యాలయాలు సురక్షితంగా, పరిశుభ్రంగా ఉన్నాయో లేదో నిర్థారించేందుకు క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ధ్రువీకరణ కలిగిన జర్మనీ సంస్థ టీయూవీ రెయాన్లెండ్ ఎల్జీ నానో ఏసీలను పరీక్షించింది. బ్యాక్టీరియా వంటి వాటిని ప్రామాణిక పరిస్థితుల్లో యూవీనానో 99.99 శాతం నిరోధిస్తున్నట్లు తేలింది. గదిలోపల బ్యాక్టీరియా పరిభ్రమించకుండా చూస్తాయి. ధర చూస్తే, ఇన్వర్టర్ మోడల్కు వీటికి రూ.3000కు పైగా తేడా ఉంటుంది.
చిప్ సమస్య నుంచి ఏసీ పరిశ్రమ ఎలా తప్పించుకుంది?
వచ్చే ఏడాది జనవరి-జూన్లో తయారుచేసే ఏసీలకు అవసరమైన విడిభాగాలన్నీ ముందు ఏడాది అక్టోబరుకే ఏసీ కంపెనీలు సమకూర్చుకుంటాయి.. మిగిలిన ఉత్పత్తుల అమ్మకాలు ఏడాది పొడవునా ఉంటాయి కనుక, వాళ్లు ప్రతినెలా సమీకరించుకుంటారు. ఇప్పుడు చూస్తే రవాణా ఛార్జీలు కూడా విపరీతంగా పెరిగాయి. వీటి నుంచి ఏసీ పరిశ్రమ తప్పించుకున్నట్లే.
ఇవీ చదవండి: ఎంఐ నుంచి ఒకేసారి మూడు ఫోన్లు, ఓ టీవీ