ఉత్తర్ప్రదేశ్ గాజియాబాద్లో దారుణం జరిగింది. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని ఓ మహిళ తన ప్రియుడితో కలిసి భర్తను గొంతు నులిమి హత్య చేసింది. ఈ ఘటనలో నిందితులిద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. మృతుడిని అయాజ్గా గుర్తించారు. శనివారం రాత్రి ట్రోనికా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందీ దారుణం.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
ముఖం కనిపించకుండా ఉండాలని.. నిందితుడు బుర్ఖా ధరించి ప్రియురాలి ఇంటికి వచ్చాడు. నిందితుడు.. మహిళకు దగ్గరి బంధువు. మహిళ, ఆమె ప్రియుడు కలిసి బాధితుడు అయాజ్ గొంతు నులమగానే గట్టిగా కేకలు పెట్టాడు. అతడి అరుపులు విన్న ఇరుగుపొరుగు వారు పోలీసులకు ఫోన్ చేశారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులకు.. ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి తన భర్తను హత్య చేశారని మృతుడి భార్య చెప్పింది. ఆమె చెప్పిన విషయాలు పోలీసులకు నమ్మశక్యంగా అనిపించలేదు.
దీంతో పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు. స్థానికంగా ఉన్న సీసీటీవీ ఫుటేజీను పరిశీలించారు. బుర్ఖా ధరించిన వ్యక్తి బాధితుడి ఇంటిలోకి ప్రవేశించినట్లు కనిపించింది. ఈ దృశ్యాల ద్వారా నిందితుడిని గుర్తించి.. అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయాలు బయటపడ్డాయి. పోలీసుల ఎదుట తాను చేసిన నేరాన్ని నిందితుడు ఒప్పుకున్నాడు. మృతుడి భార్యను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.
రైలు నుంచి జారిపడి..
ఉత్తర్ప్రదేశ్ వారణాసిలో ఘోరం జరిగింది. ఓ చిన్నారి, ఆమె తండ్రి కదులుతున్న రైలులో నుంచి కిందపడి ప్రాణాలు కోల్పోయారు. స్వతంత్ర సేనాని ఎక్స్ప్రెస్ రైలులో హీరా(32) అనే యువకుడు, అతని కుమార్తె రోసీ(3)తో కలిసి దిల్లీ నుంచి బిహార్ వెళ్తున్నాడు. టికెట్లు కన్ఫర్మ్ కాకపోవడం వల్ల రైలు డోర్ వద్ద కూర్చున్నారు. రైలు వారణాసికి చేరుకోగానే రోసీ అదుపుతప్పి రైలు కిందకు పడిపోయింది. కూతురిని కాపాడేందుకు ఆమె తండ్రి కూడా కిందకు దూకేశాడు. దీంతో తండ్రికూతుర్లిద్దరూ ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
భార్యతో వివాదం వల్ల..
కర్ణాటక బెంగళూరులో దారుణం జరిగింది. తన తల్లిని భార్య సరిగ్గా చూసుకోవడం లేదని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. అతడి తల్లిసైతం ఆత్మహత్యకు పాల్పడింది. రాజగోపాలనగర పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం జరిగిందీ ఘటన. మృతులను భాగ్యమ్మ (57), శ్రీనివాస్ (33)గా పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం విక్టోరియా ఆస్పత్రికి తరలించారు.
మృతుడు హెగ్గనహళ్లిలో నివాసం ఉంటున్నాడు. అతడికి ఎనిమిదేళ్ల క్రితం సంధ్య అనే యువతితో వివాహమైంది. ఈ దంపతులకు ఆరేళ్ల కుమారుడు ఉన్నాడు. రెండు నెలల క్రితం శ్రీనివాస్ తన తల్లిని ఇంటికి తీసుకొచ్చాడు. అప్పటి నుంచి శ్రీనివాస్కు.. తన భార్య సంధ్యతో గొడవలు మొదలయ్యాయి. ఈ కారణం వల్ల మనస్తాపానికి గురైన శ్రీనివాస్ తన తల్లితో కలిసి ఆత్మహత్య చేసుకున్నాడు.
బాలుడి కిడ్నాప్..
ట్యూషన్ వెళ్లి వస్తున్న 12 ఏళ్ల బాలుడిని కిడ్నాప్ చేశారు దుండగులు. ఈ ఘటన మహారాష్ట్ర ఠాణెలో జరిగింది. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి నిందితుల చెరనుంచి బాలుడిని విడిపించారు. బాలుడిని విడుదల చేయాలంటే రూ.1.5 కోట్లు చెల్లించాలని కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి డిమాండ్ చేశారు నిందితులు. నిందితుడి భార్య, సోదరి, బావమరిదే ఈ నేరంలో భాగమయ్యారని పోలీసులు తెలిపారు. ప్రధాన సూత్రధారిపై మర్డర్ కేసులు కూడా ఉన్నాయని చెప్పారు. నిందితులందరినీ పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇవీ చదవండి: డిటోనేటర్లతో రైల్వే ట్రాక్ను పేల్చేసిన దుండగులు.. పట్టాలకు పగుళ్లు.. తప్పిన పెను ప్రమాదం
వైవాహిక బంధాలను కాపాడుతున్న జడ్జి.. రాజీ కుదర్చడంలో జాతీయ రికార్డు!