ఒక్కొక్క రూపాయి కూడబెట్టి కట్టుకున్న పొదిరిల్లు.. వరదలు వచ్చినప్పుడల్లా నీట మునిగిపోతుంది. నివాసం ఉండే యజమానులు పునరావాస కేంద్రానికి తరలిపోవాల్సి వస్తోంది. ఈ పరిస్థితిని మార్చాలనుకొన్నారు కేరళ కోజికోడ్కు చెందిన పుష్పరాజ్. మార్కెట్లో ఉన్న నిర్మాణ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని 15ఏళ్ల కిందట నిర్మించిన తన రెండు అంతస్తుల ఇంటిని ఆరు అడుగుల మేర పైకి లేపారు. భవిష్యత్తులో ప్రకృతి ప్రకోపించినా తట్టుకునేలా తిరిగి పునాది నిర్మాణం చేపడుతున్నారు.
"2018, 2020లో వచ్చిన వరదలకు మా ఇల్లు మునిగి పోయింది. 15ఏళ్ల కిందట నిర్మించింది కావడం వల్ల బాగా దెబ్బతింది. 2019లో మా పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. సుమారు ఏడన్నర అడుగుల మేర నీరు చేరుకుంది. నడుము లోతు నీటిలో చిక్కకుపోయాం. మమ్మల్ని పునరావాస కేంద్రానికి తరలించారు. చాలా మేరకు సామగ్రి ధ్వంసం అయ్యింది. అటువంటి ఇబ్బందికర అవస్థను మళ్లీ పడకూడదని ఇంటిని వీలైనంత మేర పైకి లేపాలి అనుకున్నాం."
- పుష్పరాజ్, యజమాని
సాంకేతికతతో ముందడుగు..
ఇంటిని మొత్తాన్ని పైకి లేపడం అంటే సామన్యమైన ప్రక్రియ కాదు. బేస్ నుంచి ఇంటిని వేరు చేయాలి. అంగుళం కూడా కదలకుండా యథాతథంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇందుకు ఎన్నో ఇనుప జాక్లతో ఏకకాలంలో ఈ పని చేపట్టాలి. ఇలా చేసేందుకు కోజికోడ్లోని ఓ సంస్థకు కాంట్రాక్ట్ అప్పగించారు. ఇందుకు సంబంధించిన పని వారిని మాత్రం ఝార్ఖండ్, హరియాణా నుంచి రప్పించారు.
"ఇంటిని అనుకున్న మేర పైకి లేపేందుకు స్థానికంగా ఉండే కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చాం. వారు ఇప్పుడు ఇంటిని బేస్మెంట్తో సంబంధం లేకుండా వేరు చేశారు. ఈ ప్రక్రియ కొనసాగుతోంది. భూమికి, ఇంటికి మధ్య ఉండే భాగాన్ని తిరిగి మట్టితో నింపుతున్నారు. ఇంటి చుట్టుపక్కలా కాంక్రీట్తో గోడ నిర్మిస్తున్నాం."
-పుష్పరాజ్
20 లక్షలు వెచ్చించి..
పుష్పరాజ్ దంపతులు ఈ పనికి సుమారు రూ.20 లక్షలు ఖర్చు చేస్తున్నారు. 1900 చదరపు అడుగులు ఉండే ఈ ఇంటి కోసం 200 జాక్లను కొనుగోలు చేశారు. నిజానికి అంత మొత్తం వెచ్చించి నిర్మించే కన్నా కొత్త ఇంటిని కొనుగోలు చేయవచ్చు. కానీ తమకు ఆ ఇంటి మీద ఉండే మమకారం అటువంటిదని అంటున్నారు.