ప్రముఖ కార్టూనిస్ట్ మంజుల్, ఫ్యాక్ట్చెక్ వెబ్సైట్ ఆల్ట్న్యూస్ సహ వ్యవస్థాపకుడు మహ్మద్ జుబైర్ సహా పలువురికి ట్విట్టర్ నోటీసులు జారీ చేసింది. చట్టాన్ని ఉల్లంఘించారన్న కారణంతో వారి ట్వీట్లను తొలగించాలని ప్రభుత్వ ఏజెన్సీలు సూచించిన నేపథ్యంలో ఈ నోటీసులు పంపినట్లు వెల్లడించింది. అయితే, ఏ సంస్థలు అడిగాయనే వివరాలను మాత్రం ట్విట్టర్ పేర్కొనలేదు. ట్విట్టర్ నుంచి తమకు అందిన నోటీసులను మంజుల్, జుబైర్ తదితరులు షేర్ చేశారు.
మంజుల్కు పంపిన నోటీసులో 'ప్రభుత్వ చట్టాలను ఉల్లంఘించేదిగా ఉన్న @MANJULtoons ఖాతాలోని కొన్ని ట్వీట్లను తొలగించాలని ప్రభుత్వ ఎన్ఫోర్స్మెంట్ సంస్థల నుంచి విజ్ఞాపన వచ్చింది. ఈ విషయాన్ని మీ దృష్టికి తెస్తున్నాం. ప్రభుత్వం నుంచి ఇలాంటి విన్నపం వచ్చినప్పుడు యూజర్ దృష్టికి తీసుకెళ్లడం ట్విట్టర్ బాధ్యత' అని పేర్కొంది. 'కావాలంటే ఈ అంశంపై మీరు కోర్టును ఆశ్రయించవచ్చు. లేదంటే మీరు స్వచ్ఛందంగా సదరు ట్వీట్ను తొలగించవచ్చు' అని తెలిపింది. మహ్మద్ జుబైర్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సూర్య ప్రతాప్ సింగ్ సైతం ఇలాంటి నోటీసులనే అందుకున్నారు. ఈ ముగ్గురికీ లక్షల్లో ఫాలోవర్లు ఉన్నారు.
ఇదీ చూడండి: Bengal: కేంద్ర భద్రత వద్దంటూ ముకుల్ రాయ్ లేఖ