ఉత్తర్ప్రదేశ్లోని అలీగఢ్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్లపై కొవిడ్-19 పంజా విసిరింది. అక్కడ 20 రోజుల్లో 18 మంది ప్రొఫెసర్లు కరోనా కారణంగా కన్నుమూశారు. ఫలితంగా.. ఆ విశ్వవిద్యాలయంలో వ్యాపించిన కొవిడ్ స్ట్రెయిన్పై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయాన్ని విశ్వవిద్యాలయ మాస్ కమ్యూనికేషన్ ప్రొఫెసర్, పీఆర్వో షఫీ కిద్వాయ్ వెల్లడించారు. "మేము 20 రోజుల్లో 18 మంది ప్రొఫెసర్లను కోల్పోయాం" అని ఆయన వెల్లడించారు. మరో 100 మంది టీచింగ్, నాన్టీచింగ్ సిబ్బంది.. జవహర్ లాల్ నెహ్రూ మెడికల్ కళాశాలలో చికిత్స పొందుతున్నారన్నారు.
చెబుతున్న దానికంటే ఎక్కువే..
మే 8 నాటికి క్యాంపస్లో మొత్తం 417 కొత్త కేసులు నమోదవ్వగా.. 295 మంది కోలుకొన్నారు. మొత్తం మీద 40 మంది ప్రస్తుత, మాజీ బోధనా సిబ్బంది, అంతకంటే ఎక్కువ నాన్ టీచింగ్ సిబ్బంది చనిపోయినట్లు వార్తలొస్తున్నాయి. విశ్వవిద్యాలయ వీసీ తారిక్ మన్సూర్ సోదరుడు కూడా కొవిడ్ కారణంగా కన్నుమూశారు. గత శనివారం.. లా విభాగానికి చెందిన ఒక ప్రొఫెసర్ మరణించారు.
ఇదీ చదవండి: ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇదీ మూల్యం!
ప్రముఖ ప్రొఫెసర్ కన్నుమూత..
రుగ్వేదంలో పీహెచ్డీ సాధించిన తొలి భారతీయ ముస్లింగా ప్రఖ్యాతి గడించిన ప్రొఫెసర్ ఖలీద్ బిన్ యూసఫ్ కూడా కొవిడ్కు బలయ్యారు. ఆయనతో పాటు వైద్య విభాగానికి చెందిన షాబాద్ ఖాన్, న్యాయ విభాగ డీన్ షేక్ అహ్మద్ షందానీ తదితరులు కన్నుమూసిన వారిలో ఉన్నారు.
జన్యుక్రమాన్ని దర్యాప్తు చేయండి..
విశ్వవిద్యాలయంలో సేకరించిన వైరస్ నమూనాల జన్యువులను విశ్లేషించాలని వీసీ తారిక్ మన్సూర్ ఐసీఎంఆర్కు లేఖ రాశారు. "ఇక్కడ సేకరించిన వైరస్ నమూనాలను పంపిస్తున్నాం. అలీగఢ్ ప్రాంతలో వ్యాప్తి చెందుతున్న స్ట్రెయిన్ను గుర్తించండి. దాని ఆధారంగా మేము తీసుకోవాల్సిన జాగ్రత్తలను తీసుకొంటాం" అని లేఖలో రాశారు.
ఇదీ చదవండి: కరోనా రక్షణకు సరైన దారేది?