కరోనా రోగుల చికిత్సలో ఉపయోగించే ఫాబిఫ్లూ ఔషధాలను భాజపా ఎంపీ గౌతమ్ గంభీర్కు చెందిన ఫౌండేషన్ అనధికారంగా నిల్వ చేసిందని దిల్లీ హైకోర్టుకు.. దిల్లీ ప్రభుత్వ ఔషధ నియంత్రణ అధికారి తెలిపారు. అనధికారంగా ఔషధాలను సేకరించి పంపిణీ చేసినట్లు తేలిందని స్పష్టం చేశారు. ఆలస్యం చేయకుండా గంభీర్ ఫౌండేషన్పై చర్యలు తీసుకుంటామని కోర్టుకు వివరించారు.
ఆప్ ఎమ్మెల్యే ప్రవీణ్ కుమార్ సైతం ఇదే తరహా నేరానికి పాల్పడ్డారని కోర్టుకు తెలిపారు దిల్లీ డ్రగ్ కంట్రోలర్. తమ దృష్టికి వచ్చిన ఇలాంటి కేసులన్నింటిపైనా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ కేసుల పురోగతిపై ఆరు వారాల్లోగా తమకు నివేదిక అందజేయాలని డ్రగ్ కంట్రోలర్ను దిల్లీ హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణనను జులై 29కి ధర్మాసనం వాయిదా వేసింది.
కేసు ఇదీ!
దేశంలో కొవిడ్ ఔషధాల కొరత ఉన్న సమయంలో రాజకీయ నాయకులు పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తున్న విషయంపై విచారణ చేపట్టాలని డ్రగ్ కంట్రోలర్ను మే 24న ఆదేశించింది దిల్లీ హైకోర్టు. గంభీర్ మంచి ఉద్దేశంతో ఔషధాలు కొనుగోలు చేసి ఉంటారని, కానీ, అనాలోచితంగా తప్పు చేశారని ఆ సందర్భగా వ్యాఖ్యానించింది. అలాగే.. ఆప్ ఎమ్మెల్యేలు ప్రీతి తోమర్, ప్రవీణ్ కుమార్పై వచ్చిన ఆరోపణలపైనా విచారణ చేపట్టి, నివేదిక ఇవ్వాలని దిల్లీ ప్రభుత్వ డ్రగ్ కంట్రోలర్ను ఆదేశించింది కోర్టు.
ఇదీ చదవండి- 'కోర్టునే మోసం చేయాలని చూస్తారా?'