గత ఏడాదిలో 5,133 సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్థాన్ ఉల్లఘించిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. ఈ ఘటనల్లో 46 మంది భద్రతా సిబ్బంది అమరులయ్యారని పేర్కొన్నారు. రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు ఈ మేరకు సమాధానమిచ్చారు.
పాక్ దాడులకు భారత భద్రతా దళాలు సైతం తగిన సమాధానమిచ్చాయని ఆయన చెప్పారు. కాల్పులపై ఇరుదేశాల మిలిటరీ జనరల్స్ ప్రతివారం సమావేశాలు జరుపుతారని తెలిపారు. నియంత్రణ రేఖ, అంతర్జాతీయ సరిహద్దు రేఖ పవిత్రతను కాపాడాలని పాకిస్థాన్కు ఎన్నోసార్లు నొక్కిచెప్పినట్లు గుర్తుచేశారు రాజ్నాథ్.
ఈ ఏడాది 299 సార్లు..
ఈ నూతన ఏడాదిలోనూ జనవరి 28 వరకు అధికారిక లెక్కల ప్రకారం 299 సార్లు కాల్పుల ఉల్లంఘనలు జరిగినట్లు రాజ్నాథ్ వెల్లడించారు. 2019లో 3,233సార్లు కాల్పుల ఉల్లంఘనలు జరిగాయని పేర్కొన్నారు. సరిహద్దు ప్రాంతాల్లో కరోనా ప్రభావం ఉన్నప్పటికీ కాల్పుల ఉల్లంఘనలతో పాక్ రెచ్చగొడుతోందని దుయ్యబట్టారు. కశ్మీర్లోకి ఉగ్రవాదులను పంపిస్తోందని ఆరోపించారు.