Dalit assaulted in Haryana: ఆల్కహాల్ తాగేందుకు నిరాకరించాడని దళిత యువకుడిపై అతడి గ్రామానికే చెందిన ఇద్దరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. హరియాణా రేవారీలోని భైరాంపుర్ భడాగ్ని గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఇద్దరు వ్యక్తులు కలిసి తొలుత తన చేతులు కట్టేశారని బాధిత యువకుడు ఆరోపించాడు. అనంతరం మూత్రం కలిపిన ఆల్కహాల్ తాగాలని ఒత్తిడి చేశారని చెప్పాడు. 'ఆల్కహాల్ తాగేందుకు నేను నిరాకరించాను. దీంతో వారిద్దరూ నాపై దాడి చేశారు. నన్ను తీవ్రంగా కొట్టి రూ.10 వేలతో పారిపోయారు' అని బాధితుడు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. మొబైల్ ఫోన్ కొనుక్కోవడానికి బాధితుడు వెళ్తుండగా ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. నిందితులుగా రోహిత్, తుషార్ను గుర్తించారు.
"తుషార్.. బాధితుడు ఒకే గ్రామానికి చెందినవారు. బాధితుడు ఫోన్ కొనుక్కోవడానికి వెళ్తున్నాడని తుషార్కు తెలుసు. తానూ అటువైపే వెళ్తున్నానని చెప్పి బాధితుడితో కలిసి తుషార్ వెళ్లాడు. ఏవో మాటలు చెప్పి ఓ గ్రౌండ్కు తీసుకెళ్లాడు. అనంతరం, రోహిత్తో కలిసి ఈ నేరానికి పాల్పడ్డాడు. తమతో కలిసి బీరు తాగాలని బాధితుడిపై వీరు ఒత్తిడి చేశారు. యువకుడు నిరాకరించడం వల్ల.. చేతులను కట్టేశారు. బీరులో మూత్రం కలిపి తాగాలని బలవంతం చేశారు. తాగించేందుకు ప్రయత్నించగా యువకుడు వాంతి చేసుకోవటం వల్ల తీవ్రంగా కొట్టి.. డబ్బులు, మొబైల్ ఫోన్ను లాక్కొని పారిపోయారు."
-పోలీసు అధికారి
అపస్మారక స్థితిలోకి వెళ్లిన యువకుడు.. కాసేపటికి తేరుకొని ఇంటికి వెళ్లాడని పోలీసులు వివరించారు. కుటుంబ సభ్యులు అతడిని బవాల్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం రేవారీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నిందితులపై ఎస్సీ-ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఇదీ చదవండి: చేయని నేరానికి 28ఏళ్లు జైలులోనే.. నిర్దోషిగా తేలేసరికి..