కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది తమిళనాడు ప్రభుత్వం. మరోసారి లాక్డౌన్ విధించనున్నట్లు ప్రకటించింది. అయితే రాష్ట్రం మొత్తం కాకుండా వైరస్ ప్రభావం అధికంగా చెన్నై, దాని చుట్టుపక్కల ప్రాంతాల వరకే లాక్డౌన్ను పరిమితం చేయనున్నట్లు వెల్లడించింది. జూన్ 19 నుంచి 30వరకు 12 రోజుల పాటు లాక్డౌన్ను అమలు చేయనున్నట్లు తెలిపింది.
తమిళనాడులో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో నిపుణుల ప్యానెల్తో సమావేశం నిర్వహించిన అనంతరం ఈ విషయాన్ని తెలిపారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కే పళనిస్వామి. చెన్నై, తిరవళ్లూర్, చెంగల్పేట్, కాంచీపురం జిల్లాల్లో 12 రోజులు లాక్డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించారు. ఆ ప్రాంతాల్లో నిత్యవసర సేవలకు ఆంక్షలతో కూడిన అనుమతి ఉంటుందని పేర్కొన్నారు. జూన్ 21, 28 రెండు ఆదివారాల్లో ఎలాంటి సడలింపులు లేకుండా పూర్తిస్థాయి లాక్డౌన్ అమలు చేయనున్నట్లు స్పష్టం చేశారు.
లాక్డౌన్ ఆదేశాలు
- దుకాణాలు మూసివేయాలి.
- కూరగాయలు, పండ్లు, నిత్యావసర వస్తువుల విక్రయాలకు ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2గంటల వరకే అనుమతి.
- అత్యవసరం అయితేనే ఆటోలు, ట్యాక్సీలకు అనుమతి.
- హోటళ్లు, రెస్టారెంట్లకు ఉదయం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు అనుమతి. పార్సిల్ సుదుపాయం మాత్రమే అందుబాటులో ఉంటుంది.
- ఫుడ్ డెలివరీ సంస్థలకు అనుమతి.
- చెన్నై దాటి వెళ్లాలంటే ఈ-పాస్ తప్పనిసరి. వివాహ వేడుకలు, అంత్యక్రియలు, ఆరోగ్య అత్యవసర పరిస్థితికి సంబంధించి సరైన పత్రాలు ఉంటేనే అనుమతి.
- రైలు, విమాన సేవలు యాథావిధిగా కొనసాగుతాయి.
- జూన్ 21, 28 ఈ రెండు ఆదివారాల్లో ఎలాంటి సడలింపులు లేకుండా పూర్తిస్థాయి లాక్డౌన్ అమల్లో ఉంటుంది. నిత్యావసర, అత్యవసర సేవలకే అనుమతి.
- కంటైన్మెంట్ జోన్లలో లేని 33 శాతం మంది ఉద్యోగులు మాత్రమే విధులకు హాజరుకావాలి.
- కంటైన్మెంట్ జోన్లకు ఎలాంటి సడలింపులు లేవు.
- లాక్డౌన్లో టీ షాపులు తెరిచేందుకు అనుమతి లేదు.
- అమ్మ క్యాంటీన్లు తెరిచే ఉంటాయి.
- నిర్మాణ పనులు కొనసాగించవచ్చు. పని ప్రదేశంలోనే కార్మికులకు ఆశ్రయం కల్పించాలి. వారికి తప్పనిసరిగా పరీక్షలు నిర్వహించాలి.
- బ్యాంకులు, కోర్టులు, మీడియా సంస్థలు కార్యకలాపాలు కొనసాగించవచ్చు.