హరియాణా కింగ్ మేకర్, జననాయక్ జనతాపార్టీ అధ్యక్షుడు దుష్యంత్ చౌతాలా తమ పార్టీ ఎమ్మెల్యేలతో నేడు భేటీ కానున్నారు. రాష్ట్రంలో హంగ్ ఏర్పడిన నేపథ్యంలో.. దిల్లీ వేదికగా తమ పార్టీకి చెందిన 10 మంది శాసనసభ్యులతో పార్టీ వ్యూహంపై చర్చిస్తారని సమాచారం. ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలనే అంశంపై కీలక చర్చ జరపనున్నారని తెలుస్తోంది.
90 సీట్లున్న అసెంబ్లీలో హరియాణా ప్రజలు హంగ్కు పట్టం కట్టారు. మెజారిటీ కోసం 46 సీట్లు అవసరం. భాజపా 40 స్థానాల్లో విజయం సాధించింది. అదే సమయంలో కాంగ్రెస్ 31, జేజేపీ 10 సీట్లలో గెలిచాయి. ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థుల్లో 8 మంది అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు.
భాజపావైపే మొగ్గు!
ఇప్పటివరకు భాజపా, కాంగ్రెస్లలో ఏ పార్టీతోనూ దుష్యంత్ అవగాహనకు రాలేదు. కింగ్ మేకర్గా అవతరించిన దుష్యంత్.. భాజపా వైపే మొగ్గు చూపుతున్నారని, త్వరలో కేంద్ర హోంమంత్రి, భాజపా అధ్యక్షుడు అమిత్షాతో సమావేశమవుతారని సమాచారం.
2014 ఎన్నికల్లో సంపూర్ణ మెజారిటీ సాధించి హరియాణాలో సొంత బలంపై ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది భాజపా. అయితే తాజా ఫలితాల్లో ఆరు సీట్లు వెనకబడింది. ఈ నేపథ్యంలో జేజేపీ, స్వతంత్రులు కీలకం కానున్నారు.
కాంగ్రెస్ పరిస్థితీ అంతే..
31 స్థానాల్లో విజయం సాధించి మెజారిటీకి 15 సీట్లు వెనకబడిన కాంగ్రెస్ సైతం జేజేపీ, స్వతంత్రులపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దుష్యంత్ పార్టీని, స్వతంత్రులను దారిలోకి తెచ్చుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం హస్తం పార్టీకి సవాలే.
అయితే ఫలితాలకు ముందు ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉందని చౌతాలా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అదే సమయంలో ఏ పార్టీకి మద్దతిస్తారన్న ప్రశ్నకు చౌతాలా సమాధానం దాట వేశారు.
"ఏదైనా చెప్పేందుకు ఇది సమయం కాదు. పార్టీ ఎమ్మెల్యేలతో ముందు భేటీ కావాలి. శాసనసభపక్షనేతను ఎన్నుకోవాలి. అనంతరమే తర్వాతి అడుగు వేయాలి. హరియాణా ప్రజలు మార్పును కోరుకుంటున్నారు."
-ఫలితాల అనంతరం దుష్యంత్ చౌతాలా
ఇండియన్ నేషనల్ లోక్దళ్(ఐన్ఎల్డీ) పార్టీ నుంచి బహిష్కరణ తర్వాత.. చౌతాలా గతేడాది డిసెంబర్లో జేజేపీని ఏర్పాటు చేశారు. తాజా ఎన్నికల్లో ఐఎన్ఎల్డీ కేవలం ఒక్క సీటు మాత్రమే గెల్చుకుంది.
ఇదీ చూడండి: భూపీందర్ హుడా....లేట్గా వచ్చినా దీటైన పోటీ