నిర్భయ కేసులో కింది కోర్టు విధించిన మరణశిక్షను నిలిపివేయాలని కోరుతూ నిందితుడు ముఖేశ్కుమార్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్ను తిరస్కరించింది దిల్లీ హైకోర్టు. సెషన్స్ కోర్టులో తీర్పు అమలును సవాలు చేసేందుకు అనుమతించింది. జనవరి 7న ట్రయల్ కోర్టు ఇచ్చిన మరణశిక్ష తీర్పులో తప్పుపట్టాల్సిందేమి లేదని జస్టిస్ మన్మోహన్, జస్టిస్ సంగీత దింగ్ర సెహ్గల్ ధర్మాసనం అభిప్రాయపడింది.
2012 నాటి నిర్భయ ఘటనలో కింది కోర్టు విధించిన మరణశిక్ష తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేశాడు నిందితుడు. అయితే ముఖేశ్కుమార్ సింగ్ వ్యాజ్యాన్ని సుప్రీం తిరస్కరించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి వద్ద క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేశాడు ముఖేశ్. అనంతరం రాష్ట్రపతి నిర్ణయం వెలువడే వరకు తీర్పు అమలును నిలిపివేయాలని కోరుతూ దిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. అయితే ఈ వ్యాజ్యాన్ని న్యాయస్థానం తిరస్కరించింది. సెషన్స్ కోర్టులో అప్పీలు చేసుకోవచ్చని అవకాశం కల్పించింది.
దిల్లీ ప్రభుత్వ వివరణ
నిందితుల్లో ఒకరు రాష్ట్రపతి క్షమాభిక్షకు దరఖాస్తు చేసిన కారణంగా జనవరి 22న మరణశిక్షను అమలు చేయడం కుదరదని దిల్లీ ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది.
నలుగురు నిందితులు ముఖేశ్, వినయ్ శర్మ, అక్షయ్ సింగ్, పవన్ గుప్తాలకు ముందుగా నిర్ణయించింన ప్రకారం దిల్లీ లోని తిహార్ జైలులో జనవరి 22 ఉదయం 7 గంటలకు మరణశిక్ష అమలు చేయాల్సి ఉంది. తాజాగా క్షమాభిక్షకు దాఖలు చేసిన నేపథ్యంలో రాష్ట్రపతి నిర్ణయం అనంతరమే శిక్ష అమలుపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
ఈ క్షమాభిక్ష పిటిషన్ను తిరస్కరించాలని కాసేపటి క్రితమే రాష్ట్రపతికి సిఫార్సు చేసింది దిల్లీ ప్రభుత్వం.
ఇదీ చూడండి: నిర్భయ దోషి పిటిషన్పై దిల్లీ హైకోర్టులో నేడు విచారణ