స్టెర్లింగ్ బయోటెక్ సంస్థపై ఉన్న రూ.8వేల100కోట్ల బ్యాంకు మోసం కేసు దర్యాప్తులో భాగంగా విదేశాలకు వినతి పత్రాలను పంపాలన్న ఈడీ అభ్యర్థనకు దిల్లీ న్యాయస్థానం అనుమతిచ్చింది. అమెరికా, చైనా, పనామా, బ్రిటన్, ఆస్ట్రియా సహా మొత్తం 21 దేశాలకు లేఖలు పంపనుంది ఈడీ.
యజమానులకు అల్బానియా పౌరసత్వం
బ్యాంకు మోసానికి పాల్పడి విదేశాల్లో తలదాచుకుంటున్నారు స్టెర్లింగ్ బయోటెక్ సంస్థ యజమానులు. సంస్థ డైరెక్టర్లు నితిన్ సందెసర, చేతన్ కుమార్ సందెసర అల్బానియా పౌరసత్వం తీసుకున్నారని ఆ దేశ న్యాయస్థానం ఇటీవలే తెలిపింది. వీరిపై న్యాయపరమైన చర్యలకు ఈడీ విజ్ఞప్తి చేస్తే స్వీకరిస్తామని స్పష్టం చేసింది.
ఈడీ ఆదేశాల మేరకు ఇంటర్పోల్ సహకారంతో స్టెర్లింగ్ సంస్థ మరో డెరెక్టర్ హితేశ్ నరెందర్ భాయ్ పటేల్ను అల్బానియా రాజధాని తిరానాలో ఈ నెల 20న అరెస్టు చేశారు.
ఈడీ లేఖలు పంపే 21 దేశాల జాబితాలో అల్బానియా సహా అమెరికా, బ్రిటన్, యూఏఈ, సింగపూర్, స్విట్జర్లాండ్, హాంకాంగ్, బెర్ముడా, సైప్రస్, ఇండోనేషియా, మారిషస్, నైజిరియా, బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్ ఉన్నాయి.
తప్పుడు పత్రాలు చూపి ఆంధ్రాబ్యాంకు నుంచి రూ.5వేలకోట్ల రుణాలు తీసుకుని వాటిని స్థిరాస్తుల రూపంలోకి మార్చుకుందని స్టెర్లింగ్ బయోటెక్ సంస్థపై ఆరోపణలున్నాయి. మొత్తం రూ.8వేల ఒక వంద కోట్ల మేర బ్యాంకు మోసానికి పాల్పడ్డారని సీబీఐ అభియాగ పత్రం దాఖలు చేసింది. దీని ఆధారంగా కేసు నమోదు చేసిన ఈడీ మనీ లాండరింగ్పై దర్యాప్తు చేపట్టింది.
ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు ఐదు ఛార్జ్షీట్లు దాఖలయ్యాయి. రూ.4వేల710 కోట్లువిలువ చేసే ఆస్తులను ఈడీ జప్తు చేసింది.