కేరళలో కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. వయనాడ్ జిల్లాలోని ఓ మారుమూల గ్రామం వైరస్ హాట్స్పాట్గా మారింది. తొలుత రెండు కుటుంబాల్లో 8 మందికి కరోనా సోకినట్లు తెలిన తర్వాత వారం రోజుల్లో కేసుల సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. ఇప్పటివరకు 199 మందికి వైరస్ సోకినట్లు నిర్ధరించారు వైద్యులు.
థవింహాల్ పంచాయతీ పరిధిలోని వలాద్ వార్డ్ గ్రామంలో గురువారం వరకు 169 కేసులు రాగా శుక్రవారం ఒక్కరోజే 30 మందికి వైరస్ సోకింది. మొత్తం సంఖ్య 199కి చేరింది. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు వైద్యలు చెబుతున్నారు.
" సోమవారం నుంచి ఈ పంచాయతీని కంటేయిన్మెంట్ జోన్గా ప్రకటించాం. మరింత మందికి వైరస్ వ్యాప్తి చెందకుండా అడ్డుకుంటామనే నమ్మకం ఉంది."
- వైద్యాధికారులు
వయనాడ్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 310 పాజిటివ్ కేసులు వచ్చాయి. 2,750 మంది వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు.
ఏడుగురితో మొదలు..
గ్రామానికి చెందిన రెండు కుటుంబాల్లోని ఏడుగురికి గత వారం కరోనా పాజిటివ్గా తేలింది. ఒక కుటుంబంలోని వారు కొవిడ్-19తో మృతి చెందిన బంధువు అంత్యక్రియలకు హాజరైన నేపథ్యంలో సోకగా.. మరో కుటుంబ సభ్యుడు ఓ వివాహానికి హాజరైన తర్వాత వారందరికి పాజిటివ్గా తేలింది. గ్రామంలో వారం క్రితం 8 మందికి మాత్రమే వైరస్ నిర్ధరణ అయింది.
ఈ నేపథ్యంలో అప్రమత్తమైన వైద్య సిబ్బంది వారితో నేరుగా కలిసిన వారికి రాపిడ్ యాంటిజెన్ టెస్టులు చెపట్టారు. బుధవారానికి 83 పాజిటివ్ కేసులు తేలాయి. వారితో నేరుగా కలిసిన వారు సుమారు 500 మంది వరకు.. సెంకడరీ కాంటాక్ట్ 2వేల వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. పరీక్షలు వేగవంతం చేశారు.
ఇదీ చూడండి: తాళ్లతో లాక్కెళ్లి కరోనా మృతుడి అంత్యక్రియలు!