దేశాన్ని పరిశుభ్రంగా ఉంచాలని కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని తీసుకొచ్చినా కొంతమంది బాధ్యతా రాహిత్యంగానే ఉంటున్నారు. వీధిగోడలపై మూత్ర విసర్జన చేస్తూ పరిసరాలను మలినం చేస్తున్నారు. ఇలాంటి వారిని నియంత్రించి వీధులను శుభ్రంగా ఉంచేందుకు సరికొత్త ఆలోచన చేసింది బృహత్ బెంగళూరు మహానగర పాలిక. నగరంలోని పలు గోడలపై భారీ అద్దాలను ఏర్పాటు చేసింది. ఒక్కో అద్దం ఖరీదు రూ. 50వేలు. వీటిని నగరంలోని కేఆర్ మార్కెట్, ఈఎస్ఐ హాస్పిటల్, ఇందిరానగర్, క్వీన్స్ రోడ్ వీధుల్లోని గోడలకు అతికించింది.
గోడలపై మూత్ర విసర్జన చేసి నగర అందాన్ని మసకబార్చి నిర్లక్ష్యంగా వ్యహరించే వారు అద్దంలో తమను తాము చూసుకోనైనా మారతారనే ఉద్దేశంతోనే ఇలా చేసినట్లు బీబీఎంబీ అధికారులు తెలిపారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచి కేంద్రం ఇచ్చే స్వచ్ఛ సర్వేక్షన్ ర్యాంకింగ్స్లో ఉన్నత స్థాయిలో ఉండటమే తమ లక్ష్యమన్నారు.
2019లో అత్యంత పారిశుద్ధ్య నగరంగా నిలిచి వరుసగా మూడో ఏడాది పురస్కారం కైవసం చేసుకుంది ఇండోర్.
ఇదీ చూడండి: సీఏఏను సవాల్ చేస్తూ సుప్రీంలో కేరళ సర్కారు పిటిషన్