అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పర్యటనలో భాగంగా మురికివాడలు కనిపించకుండా దారి పొడవునా గోడ నిర్మిస్తున్న గుజరాత్లోని అహ్మదాబాద్ మున్సిపల్ అధికారులు మరో అడుగు ముందుకేశారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సబర్మతి వరకు జరిగే రోడ్ షో ప్రాంతంలో మురికివాడల్లో నివసిస్తున్న వారిని ఖాళీ చేయించేందుకు పూనుకున్నారు.
ఈ క్రమంలో నగరంలోని మొతెరా ప్రాంత మురికివాడల నివాసితులకు నోటీసులు జారీ చేశారు. ఆ ప్రాంతాన్ని 7 రోజుల్లో ఖాళీ చేయాలని ఆదేశించారు. అధికారుల నోటీసులతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాము ఎక్కడికి వెళ్లాలని ప్రశ్నిస్తున్నారు.
![Ahmedabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6126710_slum121.jpg)
22 కిలోమీటర్ల మేర..
అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు ఘనస్వాగతం పలికేందుకు అహ్మదాబాద్ ముస్తాబువుతోంది. రెండు రోజుల భారత పర్యటనలో భాగంగా ఈనెల 24న నగరంలో పర్యటిస్తారు ట్రంప్. ఈ సందర్భంగా ట్రంప్తో కలిసి ప్రధాని మోదీ 22 కిలోమీటర్ల మేర రోడ్ షో నిర్వహించనున్నారు. ఇందు కోసం అక్కడి మున్సిపల్ కార్పొరేషన్ యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తోంది. ఈ కార్యక్రమంలో 50వేల మంది వరకు పాల్గొంటారని అంచనా.
ఇదీ చూడండి: ట్రంప్-మోదీ ప్రారంభించే మోటేరా స్టేడియం విశేషాలివే...