ఉద్యోగరీత్యా సోమాలియాకు వెళ్లిన 33 భారతీయులను అక్కడి కంపెనీ నిర్భందంలో ఉంచింది. వారిని తిరిగి భారత్కు తీసుకురావడానికి సర్వదా ప్రయత్నిస్తున్నామని కెన్యాలోని భారత హైకమిషన్ తెలిపింది. అందుకుగాను సోమాలియా ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతున్నట్లు పేర్కొంది. వీలైనంత త్వరలో వారిని భారత్కు తీసుకుని వస్తామని ప్రకటించింది.
కంపెనీ చెరలో చిక్కుకున్న 33 మందిలో 25 మంది ఉత్తర్ప్రదేశ్కు, ఆరుగురు బిహార్కు, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్కు చెందిన వారు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
సోమాలియా విదేశాంగ శాఖ అధికారులతో మాట్లాడుతున్నాం. వీలైనంత త్వరగా వారిని భారత్కు తీసుకువస్తాం. వారికి కావాల్సిన ఏర్పాట్లను చేస్తున్నాం. అధికారులు మాకు భరోసా ఇచ్చారు.
-భారత్ హైకమిషన్
అసలేం జరిగింది..?
పొట్ట చేత పట్టుకొని కూలి కోసం సోమాలియాకు వెళ్లిన భారతీయుల బృందాన్ని అక్కడి కంపెనీ బందీలుగా చేసింది. మొదటి రెండు నెలలు మంచిగా చూసుకొంది. జీతం కూడా ఇచ్చింది. తరువాత వారి నుంచి పాస్పోర్టు తీసుకొని ఎనిమిది నెలలుగా ఒక్కరూపాయి జీతం ఇవ్వకుండా వేధిస్తోంది. జీతం అడిగిన వారిని కాల్చి చంపుతాం అని బెదిరిస్తున్నారు.
ఎలా బయటపడింది..?
అదే కంపెనీలో పని చేస్తున్న కార్మికుడు ఈ మధ్యనే భారత్కు తిరిగి వచ్చాడు. అక్కడి వారి బాధలను వీడియోలో చిత్రీకరించి మానవ సేవా సంస్థాన్ అనే ఎన్జీవోకు చూపించాడు. దీంతో రాజేశ్కుమార్ అనే ఎన్జీవోకు చెందిన వ్యక్తి భారత హైకమిషన్, విదేశాంగ శాఖను మెయిల్, ట్విట్టర్ ద్వారా సంప్రదించారు. వారి దుస్థితిని వివరించారు. దీనిపై స్పందించిన హైకమిషన్ తిరిగి ఇండియాకు తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
పస్తులు ఉంటూ...
'గత 15రోజులుగా భారతీయ కార్మికులకు అన్నం,నీళ్లు ఇవ్వడం లేదు. అనారోగ్య సమస్యలతో బాధ పడేవారికి మందులు కూడా ఇవ్వడంలేదు. పాస్పోర్టు అడిగితే చంపేస్తామని బెదిరిస్తున్నారని' రాజేశ్కుమార్ తెలిపారు.
ఇదీ చూడండి: 3,800 సార్లు కాల్పుల విరమణ ఉల్లంఘించిన పాక్