thumbnail

కృష్ణా నదీ జలాల విషయంలో ఎస్‌ఎల్‌పీ వేస్తే సరిపోతుందా? ఏపీకి జరుగుతున్న అన్యాయాన్ని ఎవరు పట్టించుకోవాలి!: టీడీపీ నేత విజయ్‌ కుమార్‌

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 3, 2023, 9:18 PM IST

Updated : Nov 3, 2023, 9:48 PM IST

TDP Leader Vijaykumar on Krishna River Waters: కృష్ణా నదీ జలాల పునఃసమీక్షలో ఏపీకి జరిగిన అన్యాయాన్ని.. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పట్టించుకోరా..? అని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్ ప్రశ్నించారు. అధికారులతో చెప్పి, సుప్రీంకోర్టులో ఎస్‌ఎల్‌పీ వేస్తే సరిపోతుందా..? అని నిలదీశారు. అప్పర్ తుంగ, సింగటలూరు, అప్పర్ భద్ర లాంటి ప్రాజెక్టుల వల్ల ఏపీ ఎంత నష్టపోతుందో కేంద్రానికి వివరించే ప్రయత్నమే చేయలేదని మండిపడ్జారు.

Vijaykumar Comments: ''కృష్ణా నదీ జలాల పునఃసమీక్షలో కేంద్రం తీసుకున్న నిర్ణయంతో రాయలసీమ తీవ్రంగా నష్టపోతున్నా సీఎం జగన్ ఎందుకు మాట్లాడట్లేదు..?. రాజకీయ పార్టీలు, రైతు సంఘాలను ప్రధాని వద్దకు ఎందుకు తీసుకెళ్లట్లేదు..?. కీలక నీటి విషయంలో భారాస, బీజేపీని వైసీపీ ఎందుకు పల్లెత్తు మాట అనట్లేదు..?. ఉమ్మడి రాష్ట్ర ప్రాతిపదికన కృష్ణా జలాల పంపిణీ అసంబద్ధం. బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్‌కు అదనపు బాధ్యతలు అప్పగించే అధికారం లేదు. 2002కు ముందు నదీ జలాల వివాదాలను పరిష్కరిస్తూ.. ట్రైబ్యునల్‌ ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించకూడదు. సెక్షన్ 6(2) ప్రకారం బచావత్ ట్రైబ్యునల్ తీర్పు సుప్రీంకోర్టు డిక్రీతో సమానం. బచావత్ ట్రైబ్యునల్ తీర్పును బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ కొనసాగిస్తూ.. 811 టీఏంసీలు 75 లభ్యతతో తీర్పు ఇచ్చింది. ఏపీ పునర్‌ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం.. నీటి కేటాయింపులకు రక్షణ ఉంది. తెలుగు రాష్ట్రాల మధ్య నీటిని ప్రాజెక్టుల వారీగా కేటాయించే అంశం పరిశీలనలో ఉంది. ఇప్పుడు కొత్త అంశాలు చేర్చి వాటాలు పంచాలని సూచించడం తగదు.'' అని టీడీపీ అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్ దుయ్యబట్టారు.

Last Updated : Nov 3, 2023, 9:48 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.