Chennai Air Show Tragedy : తమిళనాడులోని చెన్నై మెరీనా బీచ్ ఎయిర్ షోలో అపశ్రుతి జరిగింది. ప్రదర్శనకు హాజరైన సందర్శకుల మధ్య తొక్కిసలాట జరగడం వల్ల నలుగురు మృతి చెందారు. సుమారు 230 మందికి గాయాలయ్యాయి. మృతులను శ్రీనివాసన్, కార్తికేయన్, జాన్బాబు, దినేశ్గా అధికారులు గుర్తించారు.
భారత వైమానిక దళం ఆధ్వర్యంలో ఆదివారం ప్రారంభించిన మెగా ఎయిర్ షోను వీక్షించేందుకు లక్షలాది సందర్శకులు పోటెత్తారు. తిరుగు ప్రయాణంలో ఎక్కడికక్కడ రద్దీ ఏర్పడటంతో వారంతా తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. ఈ క్రమంలోనే జరిగిన తొక్కిసలాటలో నలుగురు మృతి చెందారు. అనేక మంది గాయపడ్డారు. తీవ్ర రద్దీ, ఉక్కపోతతో పలువురు సొమ్మసిల్లి పడిపోయారు. ఎయిర్ షోకు దాదాపు 10 లక్షలమంది హాజరైనట్లు అంచనా.
ఎయిర్ షో ముగిసిన అనంతరం తిరిగి వెళుతున్న క్రమంలో లక్షల మంది ఒక్కసారిగా రోడ్లుపైకి రావడం వల్ల వారి మధ్య తొక్కిసలాట కారణంగా దుర్ఘటన జరిగింది. ఈ ఘటన జరిగిన వెంటనే అప్రత్తమైన పోలీసులు, ఉన్నతాధికారులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. లక్షల మంది రోడ్లపైకి రావడంతో అంబులెన్సు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
మధ్యాహ్నం ఒంటిగంటకే ప్రదర్శన ముగిసినప్పటికీ సాయంత్రం వరకు ట్రాఫిక్ కొనసాగింది. క్షతగాత్రులను అంబులెన్స్ల ద్వారా ఆసుపత్రులకు తరలించేందుకూ ఇబ్బంది ఎదురైంది. చెన్నైనుంచే కాకుండా పరిసర ప్రాంతాల ప్రజలు భారీగా తరలిరావడం వల్ల మెరీనా బీచ్ సమీపంలోని లైట్హౌస్ మెట్రో స్టేషన్, వెళచ్చేరి వద్ద ఉన్న ఎంఆర్టీఎస్ రైల్వేస్టేషన్లు కిక్కిరిసిపోయాయి. షో ముగిసిన అనంతరం తిరుగుప్రయాణం కోసం వేలాది మంది ఒక్కసారిగా స్టేషన్లకు చేరుకోవడం వల్ల ప్లాట్ఫాంలపై నిలబడేందుకు కూడా వీల్లేని పరిస్థితి ఏర్పడింది. అన్నా స్క్వేర్లోని బస్స్టాప్కు సందర్శకులు పోటెత్తారు.