తెలుగు సినిమాల్లో ఆణిముత్యాలను కొన్ని ఏరితే.. అందులో మిలమిలా మెరిసిపోయే కొన్నింటిలో 'మిథునం' ఒకటి. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, లక్ష్మీ ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ సినిమా ఆ రోజుల్లో ట్రెండ్ సెట్టర్ అనే చెప్పొచ్చు. రెండే పాత్రలతో తనికెళ్ల భరణి తెరకెక్కించిన విధానం.. ఎస్పీబీ, లక్ష్మీ నటన సినిమాకు ఊపిరి పోశాయి. అంతేకాదు ఈ సినిమాకు భాష ప్రధానం కాదు అని కూడా రుజువు చేశారు. అందుకేనేమో ఈ సినిమా వచ్చి ఎనిమిదేళ్లు దాటుతున్నా.. ఇంకా ప్రేక్షకుల నోళ్లలో నానుతూనే ఉంది. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం టాలీవుడ్లో చక్కర్లు కొడుతోంది.

'మిథునం'ను బాలీవుడ్కు తీసుకెళ్లడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిసింది. ముంబయికి చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ సినిమా హక్కులు కొనుగోలు చేసిందని భోగట్టా. అంతేకాదు ఇందులో అమితాబ్, రేఖ నటిస్తారనే వార్తలూ వినిపిస్తున్నాయి. అయితే దీనిపై చిత్రబృందం నుంచి గానీ, నటీనటుల నుంచి గానీ ఇప్పటివరకు ఎలాంటి కచ్చితమైన సమాచారం వెలువడలేదు. ఒకవేళ అన్నీ అనుకున్నట్లుగా జరిగి ఈ కాంబినేషన్ కుదిరితే అభిమానులకు పండుగనే చెపపాలి. ఎన్నో ఏళ్ల తర్వాత ఈ జంట జోడీ కడుతుంటే.. వారిని డైరెక్ట్ చేసే అవకాశం ఎవరికి వస్తుందో చూడాలి మరి!

ఇదీ చూడండి : పాటకు మణిమకుటం- గాన కళా తపస్వి