Parliament New Uniform : పార్లమెంట్ సిబ్బంది కొత్త యూనిఫాంపై 'కమలం' గుర్తు!.. కాంగ్రెస్ ఫైర్.. 'పులి, నెమలి ఎందుకు గుర్తురాలేదు?' - పార్లమెంట్ సిబ్బంది యూనిఫాంపై కాంగ్రెస్ విమర్శలు
Parliament New Uniform : పార్లమెంట్ సిబ్బంది కొత్త యూనిఫాంను ధరించనున్నారు. కొత్త పార్లమెంట్లోకి వెళ్లే సమయంలో ఈ యూనిఫాంను ధరించనున్నట్లు సమాచారం. అయితే సిబ్బంది యూనిఫాంపై కమలం పువ్వు గుర్తు ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్.. ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. బీజేపీ దేశం మొత్తాన్ని కాషాయికరణ చేసేందుకు ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ నేత రషీద్ కిద్వాయ్ ఆరోపించారు.
![Parliament New Uniform : పార్లమెంట్ సిబ్బంది కొత్త యూనిఫాంపై 'కమలం' గుర్తు!.. కాంగ్రెస్ ఫైర్.. 'పులి, నెమలి ఎందుకు గుర్తురాలేదు?' parliament new uniform](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12-09-2023/1200-675-19493675-thumbnail-16x9--parliament--new--uniform.jpg?imwidth=3840)
![ETV Bharat Telugu Team author img](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telugu-1716536082.jpeg)
Published : Sep 12, 2023, 5:32 PM IST
|Updated : Sep 12, 2023, 10:30 PM IST
Parliament New Uniform : పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల సమయంలో సిబ్బంది కొత్త యూనిఫాం ధరించనున్నారు. ఈ యూనిఫాంను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (NIFT) ప్రత్యేకంగా రూపొందించింది. ఇది నెహ్రూ జాకెట్ల మాదిరిగా ఊదా ఎరుపు రంగు లేదా గులాబీ రంగులో ఉంటాయి. పువ్వుల డిజైన్తో ముదురు గులాబీ రంగులో ఉంటాయి. ఉద్యోగులు ధరించే ప్యాంట్లు ఖాకీ రంగులో ఉంటాయి. మరికొన్ని మార్పులతో భారతీయ సంస్కృతికి అద్దం పట్టేలా డిజైన్ చేశారు. ఉభయ సభల్లో కూడా మణిపురి తలపాగాలు ధరించేలా నిర్ణయించారు. పార్లమెంట్ భవనంలో ఉన్న భద్రతా సిబ్బందికి సఫారీ సూట్లకు బదులుగా మిలటరీ తరహాలో డిజైన్ ఉంటుందని కథనాలు వస్తున్నాయి.
కాగా.. పార్లమెంట్ సిబ్బంది యూనిఫాంపై కమలం పువ్వు గుర్తు ఉన్నట్లు వస్తున్న వార్తలపై కాంగ్రెస్, ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ప్రభుత్వానికి ఏదో అజెండా ఉందని.. అందుకే యూనిఫాం మార్చిందని కాంగ్రెస్ నేత రషీద్ కిద్వాయ్ ఆరోపించారు. 'యూనిఫాంలో మార్పులు చేయాలంటే కమలం పువ్వు డిజైన్ ఎందుకు? బీజేపీ ప్రభుత్వం దేశం మొత్తాన్ని కాషాయ రంగులోకి మార్చాలనుకుంటోందా?' అని కిద్వాయ్ ప్రశ్నించారు.
మరోవైపు, ప్రజాస్వామ్య దేవాలయంగా భావించే పార్లమెంట్లో కేంద్రం కాషాయీకరణ, అజెండా రాజకీయాలకు పాల్పడుతోందని ఆర్జేడీ నేత మనోజ్ ఝా ఆరోపించారు. పార్లమెంట్ సిబ్బంది.. తమ పార్టీ దుస్తులను ధరించేలా ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన అన్నారు.
యూనిఫాం కమలం గుర్తు ఎందుకు?
జాతీయ జంతువైన పులి లేదా జాతీయ పక్షి అయిన నెమలిని కాకుండా 'కమలం'ను ఎందుకు పార్లమెంట్ సిబ్బంది యూనిఫాంపై పెడుతున్నారని కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్ ప్రశ్నించారు. 'కమలం మాత్రమే ఎందుకు? నెమలి లేదా పులిని ఎందుకు పెట్టలేదు. బీజేపీ పార్టీ చిహ్నం కాదని పులి లేదా నెమలిని పెట్టలేదా?' అని ప్రశ్నించారు.
సెప్టెంబరు 18 నుంచి 22 వరకు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వినాయక చవితిని పురస్కరించుకొని సెప్టెంబర్ 19 నుంచి ఈ సమావేశాలను కొత్త భవనంలోకి మార్చనున్నారని తెలుస్తోంది. అప్పుడు నూతన పార్లమెంటు భవనంలోకి వెళ్లే సమయంలో సిబ్బంది కొత్త యూనిఫాం ధరించి వెళ్లనున్నట్లు సమాచారం.
Sonia Gandhi Letter To Modi : 'అజెండా చెప్పకుండా పార్లమెంటు సమావేశాలా?.. ఈ 9 అంశాలపై చర్చించండి!'