Published : Jun 7, 2024, 1:46 PM IST
'కార్పొరేట్ కళాశాలల్లో ఫీజులు నియంత్రించాలి - గవర్నమెంట్ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం అమలు చేయాలి' - SFI Protest at Intermediate Board Office
SFI Protest at Intermediate Board Office : కార్పొరేట్ కళాశాలల్లో ఫీజులు నియంత్రణ చేయడం సహా ప్రభుత్వ ఇంటర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్లోని ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయం ఎదుట ఎస్ఎఫ్ఐ శ్రేణులు ఆందోళనలకు దిగారు. ఈ ఆందోళనలు కాస్త స్వల్ప ఉద్రిక్తతకు దారి తీశాయి. హైదరాబాద్ నాంపల్లిలోని ఇంటర్ బోర్డు ముందు బైఠాయించినా అధికారులు స్పందించకపోవటంతో పలువురు ఎస్ఎఫ్ఐ శ్రేణులు గేటు పైకి ఎక్కి నిరసన వ్యక్తం చేశారు.
ఆందోళనల నేపథ్యంలో అక్కడే ఉన్న పోలీసులు వారిని అడ్డుకోవటంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. ఈ సందర్భంగా ప్రభుత్వం మారినా విద్యా వ్యవస్థలో ఎలాంటి మార్పులు రాలేదని విద్యార్థి నేతలు ఆరోపించారు. అనుమతులు లేని కళాశాలలను వెంటనే మూసివేయాలని డిమాండ్ చేశారు. రీ-వెరిఫికేషన్ పేర్లతో కొన్ని కార్పొరేట్ కళాశాలలు రూ.లక్షల ఫీజులను వసూలు చేస్తున్నాయని, వాటిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ శ్రేణులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.