Published : Jun 20, 2024, 4:54 PM IST
ముద్రగడ పద్మనాభరెడ్డి - పేరు మార్పుపై గెజిట్ నోటిఫికేషన్ - Mudragda Name Changed
Mudragda Name Changed: మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత ముద్రగడ పద్మనాభం పేరు మార్పుపై ఏపీ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఎన్నికల ముందు వైఎస్సార్సీపీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తుందని, పిఠాపురంలో పవన్ ఓడిపోతాడని ముద్రగడ వ్యాఖ్యానించారు. దీనిపై అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తడంతో పవన్ ఓడిపోకపోతే తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని ముద్రగడ సవాల్ చేశారు. అయితే ఎన్నికల్లో పవన్ ఘన విజయం సాధించటంతో అన్నట్లుగానే తన పేరును మార్చుకుంటున్నట్లు ముద్రగడ ప్రకటించి సంచలనం సృష్టించారు.
పేరు మార్పు కోసం ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు ఇటీవల ప్రకటించారు. ఈ క్రమంలో పేరు మార్పు కోసం ముద్రగడ దరఖాస్తు చేసుకున్నారు. ఆయన అభ్యర్థన మేరకు ముద్రగడ పద్మనాభరెడ్డిగా పేరు మారుస్తూ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. కాగా ఎన్నికల ముందు ముద్రగడ జనసేనలో చేరుతారని జోరుగా ప్రచారం సాగగా ఆయన మాత్రం కుమారుడితో కలిసి వైఎస్సార్సీపీలో చేరారు. ఈ క్రమంలో జనసేనాని పవన్పై విమర్శలు చేయగా ముద్రగడ తీరును ఆయన కుమార్తె సైతం తీవ్రంగా వ్యతిరేకించింది.