Published : 2 hours ago
'మా డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మాకే కేటాయిచాలి'- కంటోన్మెంట్లో స్థానికుల ఆందోళన - Cantonment Locals Protest
Cantonment Locals Protest For 2BHK Houses : సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలోని మడ్ ఫోర్డ్లో ఉన్న రెండు పడక గదుల ఇళ్లను మూసి నిర్వాసితులకు కేటాయిస్తున్నారన్న సమాచారంతో ఒక్కసారిగా ఆందోళన నెలకొంది. ఇప్పటికీ స్థానికులకు ఇండ్లు కేటాయించకుండా మూసీ పరివాహక ప్రాంతాల్లో పిల్లలు కోల్పోయిన వారికి ప్రభుత్వం ఇచ్చేందుకు రంగం సిద్ధం చేయడంతో స్థానిక ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేశారు. వెంటనే కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ అక్కడికి చేరుకొని స్థానికులతో మాట్లాడి రెండు పడక గదుల ఇళ్ల విషయంలో స్థానికులకి కేటాయిస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు. కొంతమంది తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు.
ఈ విషయంపై ఇప్పటికే తాను మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి, జిల్లా కలెక్టర్తో మాట్లాడినట్లు తెలిపారు. ఇక్కడ నిర్మించిన ఇళ్లను స్థానికంగా ఉన్న అర్హులైన వారికే కేటాయిస్తామని ఎమ్మెల్యే శ్రీగణేష్ తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు మాట్లాడుతూ బయట వ్యక్తులకు రెండు పడక గదుల ఇళ్లను కేటాయిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. తమకు ఈ ఇళ్లు కేటాయిస్తామని ఎన్నికల ముందు చెప్పారని ఇప్పుడు వేరే వాళ్లకు ఇస్తే ప్రాణాత్యాగానికైనా సిద్ధమని తెలిపారు. ఎన్నో సంవత్సరాలుగా నివాసం ఉంటున్న తమకోసం నిర్మించిన రెండు పడక గదుల ఇళ్లను నిరాశ్రయులైన మూసీ పరివాహక ప్రాంత ప్రజలకు కేటాయిస్తే తమ పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.