రోడ్డు దుస్థితిపై బురదనీటిలో కూర్చుని నిరసన తెలిపిన మహిళ - Woman protest on muddy road - WOMAN PROTEST ON MUDDY ROAD
🎬 Watch Now: Feature Video
Published : May 23, 2024, 7:12 PM IST
Woman Protest On Muddy Road : హైదరాబాద్ ఎల్బీనగర్ పరిధిలో నాగోల్ నుంచి ఉప్పల్ వరకు రోడ్లన్నీ గుంతలమయం కావడంతో ఓ మహిళ వినూత్నంగా నిరసన చేపట్టింది. నాగోల్ వద్ద ఉన్న లోతైన మురికినీటి గుంతలో కూర్చొని ధర్నాకు దిగింది. రోడ్లు అధ్వాన్నంగా ఉండటంతో గతంలో తమ పిల్లలు ప్రమాదానికి గురయ్యారని సదరు మహిళ వాపోయింది. నాగోల్ నుంచి ఉప్పల్ వచ్చేలోపు 30 గుంతలు ఉన్నాయని లెక్కపెట్టానంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. గుంతల కారణంగా రోజూ నరకయాతన అనుభవిస్తున్నామని నిరసన చేపట్టిన మహిళ తెలిపింది. అధికారులు ఈ సమస్యను ఎప్పుడు పరిష్కరిస్తారో కచ్చితమైన తేదీ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.
ట్యాక్స్లు ఏమవుతున్నాయని జీహెచ్ఎంసీని ప్రశ్నించిన ఆమె కొత్త రోడ్డు ఎందుకు వేయడం లేదని ప్రశ్నించింది. సదరు మహిళలతో పాటు బీజేపీ నాయకులు చింతల సురేందర్ ఆమెకు మద్దతు ఇచ్చారు. చివరకు జీహెచ్ఎంసీ అధికారులతో మాట్లాడించి నచ్చజెప్పడంతో ఆందోళన విరమించింది. మహిళ నిరసన చేపట్టిన ఘటన స్థానికంగా ఒక్కసారిగా చర్చనీయాంశమైంది. అధికారులు స్పందించి రోడ్డుపై ఉన్న గుంతలను పూడ్చేవిధంగా చర్యలు చేపట్టాలని స్థానికులు, వాహనదారులు కోరుతున్నారు.