Vyjayanthi Book Launch Event : "వైజయంతి" – 'జగన్నాథ పండితరాయలు' నవలపై ప్రముఖుల అభిప్రాయాల సమాలోచనా గ్రంథావిష్కరణ సభ హైదరాబాద్లో ఘనంగా జరిగింది. 11వ తేదీన రవీంద్రభారతి సమావేశ మందిరంలో ఎంవీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో సుధామ సృజనకర్తగా విహారి సంపాదకత్వంలో తీర్చిదిద్దిన 'సప్తశతి' (సప్తపదుల కవితా సంకలనం) తో పాటు, విహారి స్వయంగా రచించిన 'జగన్నాథ పండితరాయలు' చారిత్రక నవలపై సమాలోచన గ్రంథం 'వైజయంతి'ఆవిష్కరణ జరిగింది. ప్రభుత్వ మాజీ సలహాదారు, విశ్రాంత ఐఏఎస్ అధికారి డా.కె.వి.రమణాచారి ఈ రెండు పుస్తకాలను ఆవిష్కరించారు.
యాభై ఏళ్ల తపస్సు : పుస్తకాల ఆవిష్కరణ అనంతరం విశ్రాంత ఐఏఎస్ కేవీ రమణాచారి మాట్లాడుతూ 'జగన్నాథ పండితరాయలు' నవల ఊహాత్మకమే అయినప్పటికీ ప్రసిద్ధ కవి, రచయిత శ్రీ విహారి (జొన్నలగడ్డ సత్యనారాయణమూర్తి) యాభై ఏళ్లు చరిత్రని శోధించి రాశారని ప్రశంసించారు.
"సాహిత్యంలో స్వేచ్ఛగా విహరించే కథారాజు మా విహారి అని నేను అంటుంటాను. ‘జగన్నాథ పండితరాయలు’ నవల సాహితీ లోకంలో విహరిస్తూనే ఉంటుంది." – కేవీ రమణాచారి, రాష్ట్ర ప్రభుత్వ పూర్వ సలహాదారు
తానూ పదేళ్లు ప్రభుత్వంలో సాంస్కృతిక శాఖకు సలహాదారుగా ఉన్నానని రమణాచారి గుర్తు చేసుకున్నారు. ఈ రోజుల్లో ప్రభుత్వ సలహాదారుగా ఉండటమంటే పాముతో చెలగాటమాడినట్లేనని, పాము పడగ నీడలో కప్ప ఉన్నట్లుగా ఉంటుందన్నారు. సలహాదారుగా చాలా ఆచితూచి వ్యవహారించాల్సి ఉంటుందని వ్యక్తీకరించారు.
తెలుగువాడైన జగన్నాథుడు 17వ శతాబ్దంలో తాను బ్రాహ్మణుడై కూడా, మొఘల్ చక్రవరి జహంగీర్ వద్ద సలహాదారుగా ఉండి 'పండితరాయలు' అని బిరుదు పొందారని రమణాచారి కీర్తించారు. జహంగీర్ కంటే ఆయన భార్య నూర్జహాన్ జగన్నాథరాయలును గౌరవించేవారని, మహారాణి అయినప్పటికీ ఆయన మాటలు శిరసావహించేవారన్నారు.
జహంగీర్ తరువాత ఆయన కుమారుడు షాజహాన్ సైతం పండితరాయలును సత్కరించారని చరిత్రను గుర్తు చేశారు. ఆ సమయంలో తన సింహాసనంలో అర్థభాగమిచ్చి గౌరవించారంటే జగన్నాథరాయలు ఎంత గొప్పవాడో అర్థమవుతోందన్నారు. అంతటి వారిని కూడా చరిత్ర మరుస్తున్న ప్రస్తుత సమయంలో ఇలాంటి చారిత్రక నవలలు మరిన్ని రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
తన యాభై ఏళ్ల కృషికి అక్షరరూపమే 'జగన్నాథ పండితరాయలు' అని రచయిత విహారి ఉద్ఘాటించారు. ఈ ప్రయత్నంలో తనకు సహకరించిన వారందరికి కృతజ్ఞతలు వ్యక్తం చేశారు. నవలపై వందకు పైగా పండితులు, రచయితలు, విమర్శకులు వారి వారి వ్యాఖ్యానాలను, అభిప్రాయాలను పంపారని, వాటిని 'వైజయంతి' పేరుతో ఇప్పుడు పుస్తకంగా తెచ్చామని చెప్పారు. కేవీ రమణాచారి గారు దీనికి ముందుమాట రాసినందుకు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
"జగన్నాథ పండితరాయలు నవల యాభై ఏళ్ల కృషి. నా కుటుంబ సభ్యులకు తెలుసు, నేను ఆ నవల కోసం ఎంత కృషి చేశానో. ముందు కావ్యంగా రాయాలనుకున్నాను. సగం రాసి వదిలేశాను. తరువాత మరో ప్రయత్నంగా గేయకావ్యం రాద్దామని మొదలుపెట్టి అదీ ఆపేశాను. ఆ తర్వాత నవలగా వచ్చింది." – విహారి, 'జగన్నాథ పండితరాయలు' నవల రచయిత
సప్తపదుల సంకలనం 'సప్తశతి' : మొదటి, రెండో పాదాలలో ఒక పదం, మూడో పాదంలో ఐదు పదాలు, అన్ని పాదాలకూ అంత్యప్రాస అనే నియమాలతో సుధామ రూపొందించిన 'సప్తపది' అనే ప్రక్రియ చాలా ప్రసిద్ధిని పొందింది. వందలాది కవులు ఈ ప్రక్రియలో కవితలను రాశారు. వాటిలో నుంచీ 700 సప్తశతులను విహారి సంపాదకత్వంలో 'సప్తశతి' పేరుతో సంకలనంగా తెచ్చామని సుధామ వివరించారు. సప్తపది నిడివి కొంతే ఉన్నప్పటికీ ఎంతో మంచి భావుకతని కవులు చూపిస్తున్నారని ప్రశంసించారు.
ప్రముఖ రచయిత వై. రామకృష్ణారావు సభకి అధ్యక్షత వహించారు. నిర్వాహకులు మట్టిగుంట వెంకటరమణ వందనసమర్పణ చేశారు.