Peddagattu Jatara in Suryapet 2025 : తెలంగాణలో రెండో అతిపెద్ద జాతరగా పేరొందిన పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతరకు సర్వం సిద్ధమైంది. నేటి నుంచి ఈనెల 20 వరకు జరిగే జాతర ప్రారంభానికి 15 రోజుల ముందు ఆనవాయితీగా చేసే తొలిఘట్టం దిష్టి పూజా కార్యక్రమాన్ని యాదవులు ఘనంగా నిర్వహించారు. రాత్రి కేశారం గ్రామం నుంచి దేవరపెట్టెను ఊరేగింపుగా ఆలయ ప్రాంగణానికి తీసుకొస్తారు. లింగమంతుల స్వామి- చౌడమ్మ దేవతతో పాటు ఇతర విగ్రహాలను కలిగి ఉన్న దేవర పెట్టె పెద్దగట్టు జాతర అంకంలోనే కీలకమైంది.
సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం దురాజ్పల్లిలో లింగమంతుల స్వామి జాతర నేటి నుంచి ఈనెల 20వరకు జరగనుంది. రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద జాతరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.5 కోట్లు మంజూరు చేసింది. అన్ని శాఖల సమన్వయంతో జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తిచేసింది. భక్తులకు కావాల్సిన మౌలిక సదుపాయాలు సమకూర్చారు. రెండేళ్లకు ఒకసారి జరిగే జాతరకి తెలుగు రాష్ట్రాల నుంచే కాక మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ నుంచి లక్షలాదిగా భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు.
దేవరపెట్టెను ఊరేగింపుగా : పెద్దగట్టు జాతరనే గొల్లగట్టు, లింగమంతుల,దురాజ్పల్లి జాతరగా పిలుస్తారు. ఇక్కడ కొలువైన లింగమంతుల స్వామి, చౌడమ్మ దేవతలను దర్శించుకుంటే కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. యాదవుల పండగైనా మిగతా వర్గాల ప్రజలు తండోపతండాలుగా తిరునాళ్లకు తరలివస్తుంటారు. ఆదివారం రాత్రి కేసారం గ్రామం నుంచి దేవరపెట్టెను ఊరేగింపుగా ఆలయ ప్రాంగణానికి తీసుకువస్తారు. గంపలతో గుడిచుట్టూ ప్రదక్షిణచేస్తారు. సోమవారం చౌడమ్మకు బోనాల సమర్పణ, మొక్కులు చెల్లిస్తారు.
మంగళవారం గుడి ముందు పూజారులు చంద్రపట్నం, బుధవారం నెలవారంతో పాటు దేవరపెట్టెను కేసారం గ్రామనికి తీసుకెళ్తారు. గురువారం మకర తోరణం ఊరేగింపుతో జాతరకు తెరపడుతుంది. పెద్దగట్టు జాతర క్రతువు మొత్తంలో యాదవులు కీలకపాత్ర పోషిస్తారు. దురాజ్పల్లి జాతరలో తొలి ఘట్టం స్వామివారి మకరతోరణం తరలింపు వేడుక ఘనంగా జరిగింది. సూర్యాపేట గొల్లబజార్లోని ఆలయం నుంచి వల్లపు వంశస్థులు మకర తోరణాన్ని పురవీరుల్లో ఊరేగింపుగా తీసుకెళ్లి దురాజ్పల్లి పెద్దగట్టుపై ఉన్న లింగమంతుల స్వామివారి ఆలయంలో అలంకరించారు.
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై దారి మళ్లింపు : అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పోలీసుశాఖ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది. 2 వేల మంది సిబ్బందితో పహారా ఏర్పాటు చేశారు. ఆకతాయిల ఆటకట్టించేందుకు షీ టీమ్స్ని రంగంలోకి దించారు. ఆలయ పరిసరాల్లో 60 సీసీ కెమెరాలు బిగించారు. పెద్దగట్టు జాతర నేపధ్యంలో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల దారి మళ్లింపు చేపట్టినట్లు ఎస్పీ సన్ప్రీత్ సింగ్ తెలిపారు. నేటి నుంచి 19 వరకు ఆంక్షలు ఉంటాయని చెప్పారు.
పారిశుద్ధ్య సమస్య తలెత్తకుండా యంత్రాంగం ప్రత్యేకంగా దృష్టి సారించింది. నిరంతరం విద్యుత్, భక్తులకు తాగునీటి ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. తెల్లవారుజాము నుంచే లింగ మంతులు స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు.
దూందాంగా మేడారం చిన్న జాతర - గ్రామంలోకి దుష్ట శక్తులు రాకుండా పూజలు
జాతర్లలో కనిపించిందల్లా కొనేసి తింటున్నారా? - అది ఆరోగ్యానికి హానికరమట
అట్టహాసంగా ప్రారంభమైన నాగోబా జాతర - అర్ధరాత్రి మహాపూజతో ఆవిష్కృతమైన ప్రధాన ఘట్టం