Multiple Choice Questions Leaked In MBBS : ఎంబీబీఎస్, పీజీ మెడికల్ ఎడ్యుకేషన్ ‘ప్రాక్టికల్’ పరీక్షల్లోనే కాదు రాత (థియరీ) పరీక్షల్లోనూ అక్రమాలు చోటుచేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా కొన్ని ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో ఈ వికృత పోకడలు తారస్థాయికి చేరుకోగా, మరికొన్ని ప్రభుత్వ కాలేజీల్లోన్లూ ఈ తరహా ధోరణి వేళ్లూనుకోవడం ఆందోళన కలిగిస్తోంది. అడ్డుకోవాల్సిన ఆరోగ్య వర్సిటీ అధికారుల్లో కొందరు కొన్ని ప్రైవేటు, ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రొఫెసర్లతో లాలూచీ పడుతుండటం గమనార్హం. థియరీ పరీక్షల నిర్వహణలో సీసీ కెమెరాలున్నప్పటికీ అవి తూతూ మంత్రంగానే పని చేస్తున్నాయనే విమర్శలున్నాయి. జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) కూడా శిక్షణ, పరీక్షల విధానంలో సమూల మార్పులు తీసుకు రావాల్సిన అవసరముందని నిపుణులు సూచిస్తున్నారు. అందులో ముఖ్యమైనవి.
పరీక్షల విభాగం ప్రక్షాళన అవసరం : ఎంబీబీఎస్ థియరీ పరీక్షలో 10 మార్కులను మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు (ఎంసీక్యూ) ఇస్తున్నారు. వాటిని కాళోజీ హెల్త్ యూనివర్సిటీ పరీక్షల విభాగంలోని కొందరు అధికారుల సహకారంతో కొందరు ప్రొఫెసర్లు లీక్ చేస్తున్నట్లుగా ఆరోపణలున్నాయి. ఈ 10 మార్కులను సాధిస్తే ఎంబీబీఎస్లో ఉత్తీర్ణత సాధించడం సులభం. ఎందుకంటే ఎంబీబీఎస్ వైద్య విద్య ఉత్తీర్ణత 40-60 విధానంలో కొనసాగుతోంది. అంటే ప్రాక్టికల్స్లో 40 థియరీలో 60 శాతం మార్కులొచ్చినా లేదా ప్రాక్టికల్స్లో 60 థియరీలో 40 శాతం సాధించినప్పటికీ ఉత్తీర్ణులవుతారు. ఎలాగూ ప్రయోగ పరీక్షల్లో (ప్రాక్టికల్స్) 90-95 శాతం మార్కులు వచ్చే విధంగా అక్రమాలకు తెగబడుతుండడంతో, థియరీలో ఈ 10 మార్కులు సాధిస్తే పాస్ అవడం సులభమని భావిస్తున్నారు. ఆరోగ్య విశ్వవిద్యాలయం పరీక్షల విభాగాన్ని ప్రక్షాళన చేయడం ద్వారా వీటికి అడ్డుకట్ట వేయొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
డీఎన్బీ విధానాన్ని అనుసరిస్తే మేలు : ప్రస్తుతం డీఎన్బీ(డిప్లొమేట్ నేషనల్ బోర్డు)లో కొనసాగుతున్నటువంటి విధానాన్నే పీజీ, సూపర్ స్పెషాలిటీ విద్యార్థులకూ వర్తింపజేయాలి. అందులో వేర్వేరు ప్రైవేటు మెడికల్ వైద్యసంస్థల్లో డీఎన్బీ చేస్తున్న విద్యార్థులను ఒక ప్రభుత్వ వైద్యసంస్థ పరిధిలోకి తీసుకొచ్చి అక్కడ వారికి ప్రాక్టికల్స్, థియరీ పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఎగ్జామినర్లను కూడా ఆ కాలేజీ నుంచి సంబంధిత విభాగంలో ఒక్కరినే ఎంపిక చేస్తున్నారు. మిగిలిన వారిని దేశంలోని పలు ఇతర రాష్ట్రాల నుంచి పంపిస్తున్నారు. ఉదాహరణకు రాష్ట్రంలోని వేర్వేరు ప్రైవేటు వైద్యసంస్థల నుంచి నెఫ్రాలజీ పీజీ సూపర్ స్పెషాలిటీ చదివే మెడికల్ విద్యార్థులకు హైదరాబాద్లోని నిమ్స్లో ప్రాక్టికల్స్, థియరీ పరీక్షలు నిర్వహిస్తున్నారు.
ఇక్కడ నిమ్స్ నెఫ్రాలజీ ప్రొఫెసర్ను ఒకరిని మాత్రమే ఎగ్జామినర్గా ఇచ్చి మరో 3 దేశంలోని ఇతర రాష్ట్రాల నుంచి ఎగ్జామినర్లుగా పంపిస్తున్నారు. తద్వారా ఏ రాష్ట్రం నుంచి ఎగ్జామినర్లు వస్తున్నారో విద్యార్థులకు తెలిసే అవకాశం ఉండదు. ఇప్పుడు ఎన్ఎంసీ పరిధిలోని ప్రైవేటు మెడికల్ కాలేజీల పీజీ విద్యార్థులను సబ్జెక్టుల వారీగా ఒకేచోటుకు చేర్చి గాంధీ, ఉస్మానియా, నిమ్స్ వంటి చోట్ల నిర్వహించవచ్చు. తద్వారా పరీక్షల్లో అక్రమాలను కొంతవరకైనా అడ్డుకట్ట వేయవచ్చు. ప్రాక్టికల్స్, రాత పరీక్షలు నిర్వహించే ప్రతి రూంలోనూ సీసీ కెమెరాలు బిగించి ఆరోగ్యవర్సిటీ నుంచి పర్యవేక్షించాలి.
3 ఏళ్లకు ఓసారి ఎందుకు? : ప్రస్తుతమున్న విధానంలో పీజీ వైద్యవిద్య పూర్తయిన 3 ఏళ్ల తర్వాత ప్రాక్టికల్, రాత పరీక్షలుంటున్నాయి. ఎక్కువ శాతం ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో అధ్యాపక సిబ్బంది అరకొరగానే ఉన్నారు. ఓపీ, ఐపీల్లో రోగులు కూడా అంతగా ఉండరు. దీంతో ప్రైవేటున చుదువుకునే వారికి సరైన శిక్షణ కొరవడుతోంది. చివరి సంవత్సరంలోకి అడుగుపెట్టాక ఏదో రకంగా పాస్ అయితే చాలు అనే పద్ధతిలో అక్రమ మార్గాలను అనుసరిస్తున్నారు. అలా కాకుండా ఏటా విద్యార్థి ప్రతిభను అంచనా వేయడమనేది మంచి పద్ధతి. ఏడాదిలో ఎన్ని కేసులు చూశారు? ఏ రకమైన రోగులను పరీక్షించారు? అనే పరిజ్ఞానాన్ని కూడా అంచనా వేయొచ్చు.
పర్యవేక్షణ లేని 3 నెలల శిక్షణ : పీజీ విద్యార్థులు డిస్ట్రిక్ట్ రెసిడెన్సీ ప్రోగ్రామ్ కింద జిల్లా ఆసుపత్రుల్లో మూణ్నెళ్లు శిక్షణ పొందే విధానాన్ని ఎన్ఎంసీ ప్రవేశపెట్టినప్పటికీ ఇది ఆశించిన ఫలితాలనివ్వడం లేదు. ఎందుకంటే మూడు నెలల్లో వీరు ఎంతమంది పేషెంట్లను చూశారు? ఎలాంటి కేసుల్లో శిక్షణ పొందారని ఇటు వారు చదువుతున్న కళాశాలలో ప్రొఫెసర్ కానీ, అటు జిల్లా హాస్పిటల్స్ సూపరింటెండెంట్లు గాని పర్యవేక్షించడం లేదు. దీంతో వచ్చామా? వెళ్లామా? అన్నట్లుగానే జిల్లా ఆసుపత్రులలో శిక్షణ విధానం కొనసాగుతోంది.
వైద్యవిద్య కోసం విదేశాలకు వెళ్తున్నారా? ఐతే ఈ జాగ్రత్తలు తప్పనిసరి!